కలం, ఖమ్మం బ్యూరో : ఖమ్మం (Khammam) కార్పొరేషన్ పరిధిలోని భూదాన్, ప్రభుత్వ భూముల దురాక్రమణకు పాల్పడి, పేద ప్రజల నుండి అక్రమంగా డబ్బులు వసూలు చేసి కూడగట్టుకున్న రూ.45 లక్షల ఆస్తుల స్వాధీనానికి ఉపక్రమించామని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ వెల్లడించారు. వీటిలో నిందితుల నుంచి ఇప్పటి వరకు రూ.10.40 లక్షల విలువైన ఐదు వాహనాలు సీజ్ చేసినట్లు సీపీ గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఖమ్మం అర్బన్ పరిధిలోని వెలుగుమట్ల రెవెన్యూ ప్రాంతంలోని భూదాన్, ప్రభుత్వ భూముల ఆక్రమణలకు పాల్పడిన నిందుతులపై ఖమ్మం ఖానాపురం హవేలి పోలీస్ స్టేషన్, ఇతర పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయన్నారు.
ఆయా కేసుల విచారణలో భాగంగా ఖానాపురం హవేలి పోలీసులు బల్లి శ్రీనివాస్, పోలెబోయిన ముత్తయ్య, కొప్పెర వెంకన్న, తాళ్లూరి కృష్ణ, కుంజా కృష్ణయ్య, కల్తీ రామ చంద్రయ్య, బాణాల లక్ష్మణాచారి అనే నిందితుల కస్టడీకి తీసుకున్నారు. వారు 1549 మంది బాధితుల నుండి రూ.2.8 కోట్లు వసూలు చేసినట్టు గుర్తించామన్నారు. అందులో కొంత కోర్టు ఖర్చులకు, ర్యాలీలు, సర్వేల పేరుతో ఖర్చు చేశారని, మిగిలిన డబ్బును స్వప్రయోజనాలకు, స్థిర ఆస్తులు సంపాదించుకోవడం కోసం ఖర్చు పెట్టినట్లు నేరాన్ని అంగీకరించారని తెలిపారు. కాగా నిందితులను జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించామని కమిషనర్ (Khammam CP) ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
Read Also: హెరిటేజ్ శాఖ పరిశీలనలో ములుగు డాల్మెన్ సమాధులు
Follow Us On: Facebook

