కలం, వెబ్ డెస్క్ : పశ్చిమ బెంగాల్ (West Bengal) అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (CM Mamata Banerjee) బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. కాషాయ పార్టీ ఆదేశాల మేరకు ఎన్నికల సంఘం నడుస్తోందని ఆరోపిస్తూ.. బీజేపీని బెంగాల్.. ఆ తరువాత ఢిల్లీ నుంచి తరిమేస్తానని దీదీ శపథం చేశారు. సర్ ప్రక్రియలో ఓటర్ల పేర్లను తొలగించడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మాల్దాలో ఏడుగురు లాయర్లపై జరిగిన దాడిని ఆమె ఖండించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇప్పుడు కేంద్ర దర్యాప్తు సంస్థలైన సీబీఐ లేదా ఎన్ఐఏ చర్యలు తీసుకుంటాయా అని ఆమె ప్రశ్నించారు. ఈ ఘటనతో రాష్ట్రంలో ఒక్కసారిగా ఉలిక్కిపడిందన్నారు. అభివృద్ధిలో అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని వెళ్తానన్నారు.
బీజేపీ ఆదేశాలతో ఎన్నికల సంఘం బెంగాల్ ను నాశనం చేసిందని.. రాష్ట్రంలో అభివృద్ధి పనులు ఆగిపోయాయని మమతా బెనర్జీ ఆరోపించారు. ప్రధాని మోడీ (PM Modi), హోం మంత్రి అమిత్ షా (Amit Shah) దేశాన్ని నాశనం చేశారని విమర్శించారు. బీజేపీతో పాటు ఆ పార్టీ మిత్ర పక్షాలైన కాంగ్రెస్, సీపీఐ(ఎం) లను ఎప్పటికీ క్షమించొద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మూడు పార్టీలు ఒకదానితో ఒకటి కుమ్మక్కయ్యాయని ఆమె ఆరోపించారు.
ఇటీవల SIR ప్రక్రియలో ఓటర్ల పేర్లను తొలగించడాన్ని నిరసిస్తూ ఐదు రోజుల పాటు ధర్నా చేసిన మమత (CM Mamata Banerjee).. తాను ప్రజల హక్కుల కోసం పోరాడానని, ఈ విషయంపై వ్యక్తిగతంగా సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించానని గుర్తు చేశారు. ప్రజల హక్కులను పరిరక్షించడానికి టీఎంసీ తప్ప మరే ఇతర పార్టీ కూడా ముందుకు రాదని పేర్కొన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు బీజేపీకి తొత్తులుగా మారి మైనారిటీ ఓట్లను చీల్చేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆమె ఆరోపించారు. బెంగాల్లో టీఎంసీ మద్దతుదారులకు వెన్నెముకగా ఉన్న ముస్లిం ఓట్లను చీల్చేందుకు ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ బీజేపీతో చేతులు కలిపారని పరోక్షంగా మమతా బెనర్జీ ఆరోపణలు గుప్పించారు.
Read Also: ఆర్మీ అభ్యర్థులకు గుడ్న్యూస్.. రిజిస్ట్రేషన్ గడువు పెంపు
Follow Us On: X(Twitter)

