కలం, ఖమ్మం బ్యూరో: ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు, సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఖమ్మం (Khammam) జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ అధికారులను ఆదేశించారు. మంగళవారం వైరా (Wyra) నియోజకవర్గంలో పర్యటిస్తూ.. పట్టణంలోని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని క్యాజువాలిటీ, లేబర్ రూమ్, ఎమర్జెన్సీ వార్డ్, ఓపీ రూమ్, ల్యాబ్లను పరిశీలించారు. మందుల నిల్వలు, సిబ్బంది హాజరు రిజిస్టర్లను తనిఖీ చేశారు.
వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి, వారికి అందుతున్న వైద్య సేవల వివరాలను అడిగి తెలుసుకున్నారు. సాధారణ ప్రసవాలను (నార్మల్ డెలివరీలను) ప్రోత్సహించాలని, అనవసరంగా సీ-సెక్షన్ ఆపరేషన్లు చేయవద్దని స్పష్టం చేశారు. అన్ని రకాల ఔషధాలను తగిన స్థాయిలో నిల్వ ఉంచాలని, ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు.
ఆసుపత్రి నిర్మాణ పనులు పరిశీలన..
వైరా (Wyra) మండల కేంద్రంలో రూ.37.50 కోట్లతో నూతనంగా నిర్మిస్తున్న 100 పడకల ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ భవన నిర్మాణ పనులను కలెక్టర్ దివాకర టిఎస్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పట్టణ, గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని, నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని అధికారులను హెచ్చరించారు. నిర్ణీత గడువులోగా నిర్మాణాన్ని పూర్తి చేయాలని సూచించారు. కలెక్టర్ వెంట డీసీహెచ్ఎస్ డాక్టర్ రాజశేఖర్ గౌడ్, ఇతర ప్రభుత్వ అధికారులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
Read Also: ఆ విషయం సీఎం రేవంత్ రెడ్డికి తెలుసు: కిషన్ రెడ్డి
Follow Us On: Instagram

