కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ మెట్రో రెండో దశ అనుమతులను తానే అడ్డుకుంటున్నానని సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) స్పందించారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టుపై ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం, పోయిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమాత్రం శ్రద్ధ పెట్టలేదన్నారు. ఇంతవరకు డీపీఆర్ కూడా రెడీ చేయలేదని, ప్రాజెక్ట్ సాంకేతికత, ఆర్థికంగా సాధ్యసాధ్యాల వంటి కీలక అంశాలను పట్టించుకోలేదన్నారు. కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ నిబంధనల ప్రకారం మెట్రో టికెట్లు, ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయాన్ని మొదట మెట్రో నిర్వహణ, నిర్వహణ ఖర్చులకే వినియోగించాలన్నారు. అవి పోను మిగిలిన ఆదాయంతో మాత్రమే తీసుకున్న రుణాలను చెల్లించాలన్నారు.
తెలంగాణ ప్రభుత్వం మాత్రం టికెట్, ప్రకటనల ఆదాయాన్ని పూర్తిగా రుణాల చెల్లింపులకే ఉపయోగించాలని నిర్ణయించిందన్నారు. ఇలా అయితే, నిర్వహణ ఖర్చుల కోసం కూడా ప్రతి నెల రుణాలు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. ఈ కారణాలతోనే ప్రాజెక్టు రెండో దశ ఇంకా అనుమతి పొందడం లేదని, ఈ విషయం తెలిసి కూడా సీఎం రేవంత్ రెడ్డి తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
సింగరేణిలో కుంభకోణం జరిగిందని చెప్పలేదు..
సింగరేణిలో కుంభకోణం (Singareni Scam) జరిగిందని తాను ఎక్కడా చెప్పలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) స్పష్టం చేశారు. ఉత్పత్తి చేసిన బొగ్గు లెక్కలు, క్షేత్రస్థాయిలో నిల్వల మధ్య వ్యత్యాసాలు ఉన్నాయని ఉద్యోగ సంఘాలు, తెలంగాణలోని కొన్ని రాజకీయ పార్టీలు బొగ్గు శాఖ మంత్రి అయిన తనకు లేఖలు రాశాయన్నారు. సింగరేణి సంస్థ పూర్తిగా తెలంగాణ ప్రభుత్వ పరిధిలోనే ఉంటుందని.. కేంద్రానికి అసలు సంబంధమే లేదన్నారు. అందుకే ఈ ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలు వెల్లడించాలని సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసినట్లు వివరించారు. దీన్ని కుంభకోణంగా అభివర్ణించడం సరైంది కాదని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
Read Also: నిరుద్యోగులపై లాఠీచార్జ్ అత్యంత హేయమైన చర్య: కేటీఆర్
Follow Us On: Instagram

