కలం, ఖమ్మం బ్యూరో: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ద్వారా ఓట్లు తొలగిపోతాయనే ప్రచారం కేవలం అపోహ మాత్రమేనని ఖమ్మం (Khammam) జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ స్పష్టం చేశారు. ఖమ్మం రూరల్ మండలం గోళ్లపాడు గ్రామంలోని రైతు వేదికలో గురువారం నిర్వహించిన గ్రామ సభలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రజలతో ముఖాముఖి మాట్లాడారు. సర్ ప్రక్రియ ద్వారా కేవలం మరణించిన, డూప్లికేట్ ఓట్లను మాత్రమే తొలగిస్తామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ఈ ఏడాది జూన్ 25 నుంచి జూలై 24 వరకు బూత్ స్థాయి అధికారులు ఇంటింటికీ వచ్చి ఎన్యుమరేషన్ ఫారాలు సేకరిస్తారని తెలిపారు. వయస్సు ఆధారంగా తమతో పాటు తల్లిదండ్రుల గుర్తింపు పత్రాలను సమర్పించాల్సి ఉంటుందని వివరించారు. జూలై 31న డ్రాఫ్ట్ జాబితా విడుదల చేసి, అభ్యంతరాల స్వీకరణ అనంతరం అక్టోబర్ 1, 2026న తుది ఓటరు జాబితాను ప్రకటిస్తామని వెల్లడించారు.

