కలం, వెబ్ డెస్క్: నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్పై (Dharmapuri Arvind) తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత (Kavitha) మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నిజామాబాద్ ప్రజల్లో సగం మందికి అరవింద్ ఎవరో కూడా గుర్తులేరని, ఆయన మాటల్లో ఎప్పుడూ స్పష్టత ఉండదని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఆడబిడ్డలు స్వయం ప్రతిపత్తి గలవారని, ఎవరో మద్దతు ఇస్తేనే తాము గెలుస్తామనడం అరవింద్ అహంకారానికి నిదర్శనమని కవిత మండిపడ్డారు. తన ఎదుగుదల వెనుక ప్రజల పోరాటాలు, ఆశీస్సులు ఉన్నాయని ఆమె గుర్తు చేశారు. మరోసారి మహిళలను తక్కువ చేసేలా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.
అలాగే తాను పెట్టబోయే పార్టీ గురించి కీలక విషయాలను వెల్లడించారు కవిత. ఈ నెల ఏప్రిల్ 25న తాను పెట్టబోయే కొత్త పార్టీ వివరాలను వెల్లడిస్తానని ప్రకటించారు. ఆ రోజు నిర్వహించబోయే భారీ బహిరంగ సభ కోసం ముందస్తుగా 21 కమిటీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి కమిటీలో 30 మంది సభ్యులు ఉంటారని, సభకు వచ్చే వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఈ కమిటీలు పర్యవేక్షిస్తాయని పేర్కొన్నారు. ముఖ్యంగా ట్రాఫిక్ నియంత్రణ కోసం ప్రత్యేకంగా 500 మంది వాలంటీర్లను నియమించినట్లు కవిత వెల్లడించారు.

