కలం, కరీంనగర్ బ్యూరో : సర్ ప్రక్రియను అత్యంత పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించాలని కరీంనగర్ నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ (Praful Desai) అధికారులను ఆదేశించారు. నగరంలోని అర్బన్ తాసిల్ధార్ కార్యాలయంలో అర్బన్, రూరల్, కొత్తపల్లి ఎమ్మార్వోలు, రెవెన్యూ అధికారులు సిబ్బంది తో సమీక్షా సమావేశం నిర్వహించారు. నగరపాలక సంస్థ పరిధిలో ప్రారంభమైన “సర్” ప్రక్రియ, బూత్ లెవల్ అధికారులు చేపట్టాల్సిన ఇంటింటి సర్వే, ఓటర్ సమగ్ర సవరణ ప్రక్రియలో చేపట్టాల్సిన నియమ నిబంధనలు, తదితర కీలక అంశాల పై ఎమ్మార్వో అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. ఓటర్ సవరణ ప్రక్రియ, దరఖాస్తు ఫాంల పంపిణీ తదితర విషయాల పై పలు సూచనలు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
అనంతరం బి ఎల్ ఓ అధికారులకు ఓటర్ సవరణ కిట్లు, పంపిణీ చేశారు. అంతే కాకుండా నగరంలో పలు ప్రాంతాలను సందర్శించి ఓటర్ సమగ్ర సవరణ ప్రక్రియను క్షేత్ర స్థాయిలో తనిఖీ చేసి పరిశీలించారు. ఎమ్మార్వో అధికారులతో పాటు బిఎల్ఓ సూపర్ వైజర్లకు కీలక సూచనలు చేస్తూ… ఆదేశాలు జారీ చేశారు. సందర్భంగా క్షేత్రస్థాయిలో ఎలాంటి తప్పులు దొర్లకుండా ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఓటర్ సమగ్ర సవరణ ఫాంల పంపిణీ, ఇంటింటి సర్వే సమర్ధవంతంగా జరగాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపట్టిన ఓటర్ సమగ్ర సవరణ ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.
బూత్ లెవల్ అధికారులు (బి.ఎల్.ఓలు) ప్రతి ఇంటిని సందర్శించి ఇంటికి రెండు చొప్పున ఓటర్ సవరణ దరఖాస్తు ఫాంలను అందజేయాలని సూచించారు. దరఖాస్తు ఫాంల పంపిణీ అనంతరం వివరాల నమోదుకు సంబంధించి బూత్ లెవల్ అధికారులు వారికి అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతి రోజు భూత్ లెవల్ లో ఎన్ని దరఖాస్తు ఫాంలు పంపిణీ చేస్తున్నారో వాటి వివరాలను ఎక్సెల్ షీట్ లో నమోదు చేయాలని ఆదేశించారు. అర్హులైన వారందరినీ ఓటర్లుగా నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నగర పరిధిలో ఎవరూ ఓటు హక్కు కోల్పోకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. డబుల్ ఓటర్స్, డూప్లికేట్ ఓటర్లు, మరణించిన ఓటర్ల గుర్తించి.. తొలగించాలని అన్నారు.

