కలం, వెబ్ డెస్క్ : సరిగ్గా 43 సంవత్సరాల క్రితం క్రికెట్ చరిత్రలో భారత్ తన పేరును సువర్ణ అక్షరాలతో రచించింది. క్రికెట్ ప్రపంచాన్ని ఏలుతున్న వెస్టిండీస్ను మట్టి కరిపించి 1983 జూన్ 25న కపీల్ దేవ్ సేన ప్రపంచకప్ (1983 World Cup)ను ముద్దాడింది. అదే భారతదేశ క్రికెట్ చరిత్రలో సాధించిన తొలి వరల్డ్ కప్. నేటికి 43 ఏళ్లు పూర్తైనా ఆ విజయం ఇంకా కోట్లాది భారత అభిమానుల గుండెల్లో సజీవంగానే ఉంది. ఆ టోర్నీకి ముందు భారత్ను ఎవరూ టైటిల్ ఫేవరెట్గా చూడలేదు. 1975, 1979 వరల్డ్ కప్లలో గ్రూప్ దశ దాటలేకపోయిన జట్టు, 1983లో మాత్రం చరిత్ర సృష్టించింది. మరోవైపు వెస్టిండీస్ వరుసగా మూడో ప్రపంచకప్పై కన్నేసి ఫైనల్లో అడుగుపెట్టింది.
లార్డ్స్ వేదికగా జరిగిన ఫైనల్లో భారత్ కేవలం 183 పరుగులకే ఆలౌటైంది. శ్రీకాంత్ 38, సందీప్ పాటిల్ 27 పరుగులు చేశారు. ఆ స్కోరు చూస్తే వెస్టిండీస్ విజయం ఖాయమనే భావన అందరిలో కనిపించింది. కానీ అక్కడే అసలు కథ మొదలైంది. భారత బౌలర్లు అద్భుతంగా రాణించి వెస్టిండీస్ను 140 పరుగులకే కట్టడి చేశారు. వివ్ రిచర్డ్స్ 33, జెఫ్ డుజాన్ 25 పరుగులు చేసినా జట్టును గెలిపించలేకపోయారు. మొహిందర్ అమర్నాథ్ 26 పరుగులతో పాటు 3 వికెట్లు తీసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. చివరి వికెట్ కూడా అతడే పడగొట్టాడు.
43 పరుగుల తేడాతో భారత్ గెలిచిన ఆ క్షణం భారత క్రికెట్ దిశనే మార్చేసింది. లార్డ్స్ బాల్కనీలో కపిల్ దేవ్ వరల్డ్ కప్ ఎత్తిన దృశ్యం నేటికీ భారత క్రీడా చరిత్రలో చిరస్మరణీయ చిత్రంగా నిలిచింది. అదే విజయం భారత క్రికెట్ను ప్రపంచ శక్తిగా మార్చిన తొలి అడుగైంది.

