కలం, వెబ్ డెస్క్ : కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project) అవకతవకలపై విచారణ జరిపిన జస్టిస్ పీసీ ఘోష్ నివేదికపై తెలంగాణ హైకోర్టు స్టే విధించడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) స్వాగతించారు. తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టుపై కక్షగట్టిన కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హైకోర్టు తీర్పు ఒక గట్టి ‘చెంపపెట్టు’ అని కేటీఆర్ అభివర్ణించారు. భారత రాజ్యాంగానికి, చట్టాలకు విరుద్ధంగా ఎవరు వ్యవహరించినా దేశంలోని గౌరవ న్యాయస్థానాలు చూస్తూ ఊరుకోవని ఈ తీర్పుతో మరోసారి రుజువైందని స్పష్టం చేశారు. ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేయడంతో రాష్ట్ర ప్రభుత్వ రాజకీయ కుట్రలకు బ్రేక్ పడినట్లయిందని చెప్పారు.
అంతేకాదు కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇచ్చిన నివేదిక పీసీ ఘోష్ కమిషన్ (PC Ghose Commission) ది కాదని, అది ముమ్మాటికీ పీసీసీ (PCC) నివేదిక అని బీఆర్ఎస్ పార్టీ ముందు నుంచి చెబుతున్న మాట ఇవాళ అక్షరాల నిజమని తేలిపోయిందని కేటీఆర్ విమర్శించారు. కమిషన్ విచారణలో సహజ న్యాయ సూత్రాలను పూర్తిగా విస్మరించడమే కాకుండా, నిబంధనలకు పాతరేశారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గతంలోనే చెప్పారని గుర్తు చేశారు. ఆ విషయాలతో ఇవాళ హైకోర్టు కూడా ఏకీభవించడం హర్షణీయమని అని పేర్కొన్నారు. రాజకీయ కక్ష సాధింపు కోసం వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్న తీరును ఈ తీర్పు ఎండగట్టిందన్నారు.
ముఖ్యమంత్రి అన్నదాతలకు క్షమాపణలు చెప్పాలి ..
రెండున్నరేళ్లుగా కల్పతరువు లాంటి కాళేశ్వరం ప్రాజెక్టును పడావు పెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఇప్పటికైనా ముక్కు నేలకు రాసి, రాష్ట్రంలోని అన్నదాతలకు క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ (KTR) డిమాండ్ చేశారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే మేడిగడ్డ బ్యారేజీలో స్వల్పంగా దెబ్బతిన్న రెండు పిల్లర్లను రిపేర్ చేసి, రాష్ట్రంలోని లక్షలాది మంది రైతుల సాగునీటి కష్టాలు తీర్చాలని సూచించారు. రాజకీయ క్రీడ కంటే రైతుల ప్రయోజనాలే ముఖ్యమని ఆయన హితవు పలికారు. అంతేకాదు గోదావరి జలాలను పక్కరాష్ట్రానికి దోచిపెట్టి, తెలంగాణలో వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టే కుతంత్రాలను ఇంకా కొనసాగించాలని చూస్తే రేవంత్ సర్కారుకు రైతుల చేతిలో వాతలు తప్పవని కేటీఆర్ హెచ్చరించారు. ప్రాజెక్టుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తూ రైతుల పొలాలకు నీరు అందకుండా చేస్తున్న ప్రభుత్వ వైఖరిని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని, రైతుల పక్షాన పోరాటం కొనసాగిస్తామని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
Read Also: గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంపై సుప్రీంకోర్టు విచారణ వాయిదా
Follow Us On: X(Twitter)

