కలం, తెలంగాణ బ్యూరో: ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా అమరావతి ఫిక్స్ అయింది. తెలంగాణ తరహాలోనే ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని ఏర్పడిన రోజు జూన్ 2 గా కేంద్రం గుర్తించింది. అమలులోకి వచ్చే తేదీని 2004 జూన్ 2గా ఖరారు చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని జూన్ 2న ఫిక్స్ చేస్తూ పన్నెండేండ్ల క్రితమే విభజన చట్టం స్పష్టం చేసింది. కానీ ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో మాత్రం ఇంతకాలం కన్ఫ్యూజన్ నెలకొన్నది. రాజధాని లేకుండానే పన్నెండేండ్ల పాటు ఆ రాష్ట్ర పరిపాలన సాగింది. తాజాగా పార్లమెంటు ఉభయ సభల్లో విభజన చట్టానికి సవరణలు చేయడంతో రాష్ట్రపతి ఆమోదంతో ఆ రాష్ట్ర అధికారిక రాజధాని అమరావతి అయింది. ప్రతి సంవత్సరం జూన్ 2న ‘కాపిటల్ డే’ జరుపుకోడానికి అవకాశం లభించినట్లయింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగే రోజునే ‘ఆంధ్రప్రదేశ్ న్యూ క్యాపిటల్ అమరావతి’ పేరుతో అక్కడ కూడా ఉత్సవాలు జరుపుకోడానికి వెసులుబాటు లభించినట్లయింది. రెండు రాష్ట్రాలూ వేర్వేరు అంశాలతో ఆ రోజును ఉత్సవంగా జరుపుకోనున్నాయి. చరిత్రలో ఈ తేదీకి రెండు రాష్ట్రాల్లోనూ ప్రత్యేక ప్రాధాన్యత లభించినట్లయింది.

