కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంటోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా సీనియర్ నేత జీవన్ రెడ్డి రాజకీయ ప్రయాణం ఇప్పుడు కొత్త మలుపు తిరుగుతోంది. ఆయనను తమ పార్టీలోకి ఆహ్వానించేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) వెళ్లనున్నారు.
నేడు మధ్యాహ్నం 2 గంటలకు జగిత్యాలలోని జీవన్ రెడ్డి నివాసానికి కేటీఆర్ (KTR) స్వయంగా వెళ్లనున్నారు. ఈ పర్యటనలో ఆయనతో పాటు మాజీ మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ వంటి కీలక నేతలు కూడా ఉండటం ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇప్పటికే కేటీఆర్ ఫోన్ ద్వారా జీవన్ రెడ్డితో ప్రాథమిక చర్చలు జరిపినట్లు సమాచారం.
కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం పనిచేసి, నియోజకవర్గంలో బలమైన పట్టున్న నేతగా పేరొందిన జీవన్ రెడ్డి, గులాబీ కండువా కప్పుకుంటే జగిత్యాల జిల్లాలోనే కాకుండా ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయ సమీకరణాలు మారిపోయే అవకాశం ఉంది. మధ్యాహ్నం జరగబోయే ఈ భేటీ తర్వాత జీవన్ రెడ్డి తన నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

