కలం, వెబ్ డెస్క్: కేరళ, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) ఎక్స్ వేదికగా ఆయా రాష్ట్రాల ఓటర్లకు కీలక సందేశాన్ని అందించారు. ఈ ఎన్నికల్లో ప్రజలు రికార్డు స్థాయిలో పాల్గొని ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటుకోవాలని పిలుపునిచ్చారు. ఒక్కో రాష్ట్రాన్ని ఉద్దేశిస్తూ ప్రధాని వేర్వేరు పోస్టులు చేశారు. కేరళ (Kerala) ఓటర్లను ఉద్దేశించి మాట్లాడుతూ.. ప్రజలు ఓటింగ్ ప్రక్రియలో భారీ సంఖ్యలో పాల్గొని ప్రజాస్వామ్య విలువలకు కొత్త శక్తిని అందించాలని ఆకాంక్షించారు
ముఖ్యంగా ఈ మూడు రాష్ట్రాల్లోని యువత, మహిళా ఓటర్లు ఉత్సాహంగా ముందుకు వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని మోడీ ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. పుదుచ్చేరి (Puducherry) భవిష్యత్తును నిర్ణయించడంలో ప్రతి ఓటు ఎంతో కీలకమని, ప్రజాస్వామ్య ప్రక్రియను బలోపేతం చేసేందుకు యువత, మహిళలు పెద్ద ఎత్తున తరలిరావాలని ఆయన కోరారు. ఓటు వేయడం అనేది కేవలం హక్కు మాత్రమే కాదు, అది పౌరులందరి బాధ్యత అని ప్రధాని గుర్తు చేశారు. అస్సాం (Assam) అసెంబ్లీ ఎన్నికల పోలింగ్పై స్పందిస్తూ అస్సాం ప్రజలు ఈ ఎన్నికలను ప్రజాస్వామ్య పండుగలా జరుపుకోవాలని మోడీ పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని యువతీ యువకులు, మహిళా ఓటర్లు అత్యంత ఉత్సాహంతో ఈ వేడుకలో భాగస్వాములు కావాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటుతూ భారీ సంఖ్యలో ఓటింగ్ నమోదు కావాలని ఆయన తన సందేశంలో పేర్కొన్నారు.

