కలం, వెబ్ డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన శనివారం సమావేశమైన క్యాబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నది. 2027 గోదావరి పుష్కరాల (Godavari Pushkaralu) నిర్వహణకు భారీగా నిధులను మంజూరు చేసింది. కేబినెట్ సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. మొత్తం రూ.1,000 కోట్ల వ్యయానికి ఆమోదం తెలిపినట్లు సమాచారం. పుష్కరాల ఏర్పాట్లు, మౌలిక వసతుల అభివృద్ధి, భక్తుల సౌకర్యాలు, రవాణా, తాగునీరు, శానిటేషన్ వంటి కీలక పనుల కోసం ఈ నిధులు వినియోగించనున్నారు.
తొలివిడతగా రూ.300 కోట్లు విడుదల చేయడానికి కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నిధులతో ప్రారంభ దశ పనులను వేగవంతం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో ప్రధాన ఘాట్ల అభివృద్ధి, తాత్కాలిక సౌకర్యాల ఏర్పాటు, భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు.
ఇక మరోవైపు తెలంగాణ విద్యారంగ అభివృద్ధికి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) నిధుల ద్వారా మద్దతు ఇవ్వడానికి ప్రముఖ సంస్థలు ముందుకు వచ్చాయి. రహేజా గ్రూప్, రామ్ కీ ఫౌండేషన్, యశోదా ఫౌండేషన్లు ఈ కార్యక్రమానికి అంగీకారం తెలిపాయి. ఈ ఒప్పందాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో అధికారికంగా కుదిరినట్లు సమాచారం.
ఈ CSR భాగస్వామ్యంతో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల మెరుగుదల, డిజిటల్ విద్యా సదుపాయాల విస్తరణ, విద్యార్థులకు అవసరమైన సహాయ కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉంది. ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్యం ద్వారా విద్యారంగాన్ని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
Read Also: హృదయవిదారకం.. తెగిన తల్లి చేయితో పోలీస్ కమిషనరేట్కి జవాన్
Follow Us On: Pinterest

