కలం, వెబ్ డెస్క్: తీవ్రమైన ఎండతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న హైదరాబాద్ (Hyderabad) నగర ప్రజలకు తాత్కాలిక ఉపశమనం లభించింది. శనివారం మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం మారడంతో నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఐటీ కారిడార్ పరిధిలోని గచ్చిబౌలి, మాదాపూర్, రాయదుర్గం, కొండాపూర్, కొత్తగూడ చౌరస్తా ప్రాంతాల్లో వర్షం తీవ్రత ఎక్కువగా నమోదైంది. కొన్ని ప్రాంతాల్లో కొద్దిసేపు భారీ వర్షం కురవడంతో రోడ్లపై నీరు నిలిచిపోయింది.
వర్షం ప్రారంభమైన క్షణాల్లోనే నగర వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఉదయం వరకు వేడిగాలులతో ఇబ్బందిపడ్డ ప్రజలు ఒక్కసారిగా చల్లని వాతావరణాన్ని ఆస్వాదించారు. ఉష్ణోగ్రతలు తగ్గిపోవడంతో ప్రజలు సేదతీరారు. కార్యాలయాల నుంచి ఇళ్లకు తిరుగు ప్రయాణమవుతున్న సమయానికి వర్షం పడటంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రధాన రహదారులపై ట్రాఫిక్ నెమ్మదిగా సాగింది. పలుచోట్ల వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు అసౌకర్యానికి గురయ్యారు. కొన్ని ప్రాంతాల్లో తక్కువ సమయంలోనే భారీ వర్షం కురవడంతో డ్రైనేజ్ సమస్యలు కూడా తలెత్తాయి.

