కలం, కరీంనగర్ బ్యూరో: పేద, మధ్య తరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ఎంతో ఉపశమనం కలిగిస్తోందని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy) అన్నారు. శనివారం హుజురాబాద్ మండలంలోని కాట్రపల్లి, పెద్దపాపయ్యపల్లి, కందుగుల, ధర్మరాజుపల్లి, జూపాక, చెల్పూర్, రంగాపూర్, పోతిరెడ్డిపేట గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు చెక్కులను స్వయంగా వెళ్లి అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేస్తున్నామని చెప్పారు. నియోజకవర్గ ప్రజలకు అవసరమైన సమయంలో అండగా నిలవడం తన బాధ్యతన్నారు. సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సహాయం అందడంతో లబ్ధిదారులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. మాజీ ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ బండ శ్రీనివాస్, పీఏసీఎస్ ఛైర్మన్ కొండల్ రెడ్డి, మాజీ ఎంపీపీ సురేందర్ రెడ్డి, పార్టీ నాయకులు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.

