కలం, మెదక్ బ్యూరో: భార్య కాపురానికి రావడం లేదని అత్తగారింటికి నిప్పు పెట్టి సజీవ దహనం చేసేందుకు ప్రయత్నించాడు ఓ అల్లుడు. ఈ దారుణ ఘటన సంగారెడ్డి (Sangareddy) జిల్లాలో చోటుచేసుకుంది. హత్నూర మండలం దౌలాపూర్ గ్రామానికి చెందిన లావణ్యకి, మెదక్ జిల్లా కొల్చారం నాయిని జలాల్ పూర్ గ్రామానికి చెందిన నాగరాజుకు 2018లో వివాహం జరిగింది. నాగరాజు మద్యానికి బానిసై అదనపు కట్నం కోసం తరచూ భార్యను వేధిస్తూ ఉండేవాడు. దీంతో గత కొన్ని నెలల క్రితం ఆమె ఇద్దరు పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లిపోయింది. పుట్టింటికి వెళ్లిన తర్వాత నాగరాజు ఫోన్ చేసి చంపేస్తానని బెదిరించసాగాడు.
ఈ క్రమంలో నాగరాజు అర్ధరాత్రి అత్తగారింటికి వచ్చి పెట్రోల్ పోసి ఇంటికి నిప్పటించి ఇంటి బయట నుండి తలుపులు వేశాడు. పొగలు రావడంతో ఇరుగు పొరుగు వారు గమనించి మంటలు ఆర్పడంతో పెను ప్రమాదం తప్పింది. అత్తమామ, భార్య, ఇద్దరు పిల్లలు ప్రాణాలతో బయటపడ్డారు. అల్లుడు చేసిన దురాగతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసుల విచారణలో అల్లుడి బాగోతం బయటపడ్డది. హత్నూర పోలీసులు నాగరాజుని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.

