కలం, వెబ్ డెస్క్: ఏపీలో రాగల 3 గంటల్లో తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు (Heavy Rain Alert) కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరించింది. రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. గంటకు 40-60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది. భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వివరించింది. ఇప్పటికే అల్లూరి, ఏలూరు, పశ్చిమ గోదావరి తదితర జిల్లాల్లో వర్షాలు జోరుగా పడుతున్నాయి. భారీ వర్షాలకు కల్లాల్లోని వరి ధాన్యం తడిసిముద్దయింది. ముఖ్యంగా వరి, మొక్కజొన్న, మామిడి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. చేతికొచ్చే పంట అకాల వర్షానికి పాడైపోయిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
రాష్ట్రంలో ఏప్రిల్ 6,7 తేదీల్లో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ఏపీఎస్డీఎంఏ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

