కలం, వెబ్ డెస్క్: ధరణి (Dharani) పోర్టల్లో భారీగా అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. భూ యజమానుల వేలిముద్ర, ఓటీపీ లేకుండా అన్నింటినీ బైపాస్ చేస్తూ సాఫ్ట్వేర్ మొత్తం హైజాక్ చేశారని కేరళ సెక్యూరిటీ ఆడిట్ సంస్థ విచారణలో గుర్తించారు. ఘోస్ట్ ఐడీలతో నకిలీ రిజిస్ట్రేషన్లు చేశారని, విదేశాల్లో ఉన్నవారికి తెలియకుండానే పని కానిచ్చేసినట్లు పేర్కొన్నారు.
సిట్ లేదా విజిలెన్స్తో విచారణ..
ఈ అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా ఉన్నట్లు తెలుస్తోంది. సిట్ లేదా విజిలెన్స్ విచారణకు ఆదేశించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 8 లక్షల భూ లావాదేవీలపై ఆడిట్ నిర్వహించగా, వాటిలో 22 వేల రిజిస్ట్రేషన్లపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టైం క్లాక్ కూడా మార్చేసి పాత తేదీలతో రిజిస్ట్రేషన్లు చేశారని.. ఇది అత్యంత ఆందోళనకరమని ఆడిట్ సంస్థ పేర్కొంది.
10 వేల ఎకరాలు మార్చేశారు..
ధరణి సాఫ్ట్వేర్లో ఇష్టం వచ్చినట్లు మార్పులు చేర్పులు చేసి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 10 వేల ఎకరాల్లో భూ యాజమాన్య హక్కులు మార్చేసినట్లు ప్రభుత్వం ఇప్పటికే గుర్తించింది. సంగారెడ్డి, సిద్దిపేట, మేడ్చల్ మల్కాజ్గిరి, రంగారెడ్డి, భూపాలపల్లి జిల్లాల్లో ఇలా చేసినవారిని కూడా వివిధ విభాగాల నిపుణులతో కూడిన బ్రందం ప్రశ్నించింది.
డిప్యూటీ తహసీల్దార్లతో పాటు కింది స్థాయి సిబ్బంది పాత్రపై విచారణ జరుగుతోంది. ఈ మొత్తం వ్యవహారంలో ధరణి ఆపరేటర్ల పాత్రనే అత్యంత కీలకంగా మారింది.

