కలం, మెదక్ బ్యూరో: సంగారెడ్డి (Sangareddy) జిల్లా సీసీఎస్ పోలీసులు, గుమ్మడిదల పోలీసులు నిర్వహించిన సంయుక్త ఆపరేషన్లో మోస్ట్ వాంటెడ్ దొంగ దొరికాడు. 106 కేసుల్లో నిందితుడైన అలవాటు హౌస్ బ్రేకింగ్ నిందితుడు కోటపల్లి చంద్రి అలియాస్ శేఖర్ను అరెస్ట్ చేశారు. 22.5 తులాల బంగారం, 60 తులాల వెండి, రూ.25,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. సంగారెడ్డి జిల్లాలో వరుసగా చోటుచేసుకుంటున్న ఇంటి దొంగతనాల నేపథ్యంలో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. సీసీఎస్ సంగారెడ్డి, గుమ్మడిదల పోలీసులు సంయుక్త ఆపరేషన్లో గజదొంగను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు ఎస్పీ పరితోష్ పంకజ్ వివరాలను వెల్లడించారు. నిందితుడు 2007 నుంచి ఇంటి తాళాలు పగులగొట్టి దొంగతనాలకు పాల్పడుతున్నాడు. ఇళ్లలో చొరబడి బంగారు ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులు దొంగిలిస్తున్నాడు. ఆ సొమ్మును విక్రయించడం లేదా తాకట్టు పెడుతూ విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడు.
కేసుల చిట్టా పెద్దద్దే
సంగారెడ్డి, హైదరాబాద్ (Hyderabad), నల్గొండ, మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాల్లోని వివిధ పోలీస్ స్టేషన్లలో 80 పాత కేసులు (మేడ్చల్లో పోక్సో కేసు), 26 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 19 సార్లు జ్యుడీషియల్ రిమాండ్కు వెళ్లి, పలుమార్లు బెయిల్పై విడుదలయ్యాడు. 25పైగా కేసుల్లో శిక్షలు కూడా అనుభవించాడు. నిందితుడు కోటపల్లి చంద్రిని 2024లో మేడిపల్లి పోలీసులు అరెస్ట్ చేసి, చర్లపల్లి సెంట్రల్ జైలుకు పంపారు. సుమారు 14 నెలలు జైలులో ఉన్నాడు. అనంతరం 2025న బెయిల్పై విడుదలైనా మూడు రోజులకే దొంగతనాలు ప్రారంభించాడు.
ఆ ఇండ్లే టార్గెట్
తాళం వేసి ఉన్న ఇళ్లు, అపార్ట్మెంట్లను గమనిస్తాడు. ఆ తర్వాత ఇంట్లో లైట్, ఫ్యాన్, ఏసీ ఆన్లో ఉన్నాయా లేదా అనేది చెక్ చేస్తాడు. ఎవరూ లేరని నిర్ధారించుకున్న తర్వాత చోరీలకు పాల్పడుతాడు. చోరీ అనంతరం తప్పించుకోవడానికి వెనుక తలుపు తెరిచి ఉంచేవాడు. దొంగతనం చేసిన తర్వాత తెల్లవారుజాము వరకు పొదల్లో దాక్కొని, ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయేవాడు. గత 8 నెలల్లో 26 ఇంటి దొంగతనాలు చేసినట్లు విచారణలో తేలింది. ఎట్టకేలకు పోలీసులు బొంతపల్లి గ్రామ కమాన్ సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం రిమాండ్కు తరలించారు.

