కలం, వెబ్ డెస్క్ : ఆహార కల్తీపై కఠిన విధానాలు అమలు చేస్తామని, డ్రగ్స్ నిర్మూళనకు ఈగల్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లే ఆహార భద్రతకు ప్రత్యేక యంత్రాంగం తీసుకొస్తామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ (Damodar Raja Narsimha) తెలిపారు. దీని కోసం సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారన్నారు. ప్రజాపాలన – ప్రగతి పాలన వారోత్సవాల్లో భాగంగా ఆహార అలవాట్లపై జలవిహార్ లో నిర్వహించిన వాకథాన్ ను మంత్రి (Damodar Raja Narsimha) జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి దామోదర్ రాజనర్సింహతో పాటు ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జె. చొంగ్తు, హైదరాబాద్ సీపీ సజ్జనార్, ఆహార భద్రతా కమిషనర్ సంగీతా సత్యనారాయణ, హైదరాబాద్ కలెక్టర్ హరిచందన్తో పాటు అధికారులు కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి రాజనరసింహ మాట్లాడుతూ, సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఆహార కల్తీ చేసేవారిపై పీడీ యాక్ట్ వంటి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆధునిక జీవనశైలీ, నగరీకరణ వల్ల ప్రజల ఆహార వ్యవహారాలు మారయన్నారు. ప్రాసెస్డ్ ఫుడ్, నూనెలు అధికంగా తినడం వల్ల ఆరోగ్యానికి నష్టం వాటిల్లుతుందన్నారు. సరైన తిండితో ఆరోగ్యంగా ఉంటారని.. ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతమైన తెలంగాణ కోసం కృషి చేయాలని మంత్రి దామోదర రాజనరసింహ పిలుపునిచ్చారు.

