కలం, వెబ్ డెస్క్: భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ ఆస్పత్రి డాక్టర్ల నిర్లక్ష్యానికి రెండు నిండు ప్రాణాలు బలైపోయాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. వనజ అనే గర్భిణి జూన్ 13న పురిటినొప్పులతో భద్రాద్రి జిల్లాలోని గుండాల (Gundala) ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చింది. ఆ సమయంలో ఆస్పత్రిలో డాక్టర్లు అందుబాటులో లేరు. దీంతో స్టాఫ్ నర్స్ వనజకు కాన్పు చేసింది. వనజ ఆడబిడ్డకు జన్మనివ్వగా ఆ పాప వెంటనే చనిపోయింది. ఆ తర్వాత వనజ పరిస్థితి విషమంగా మారింది. ఆమెకు విపరీతంగా రక్తస్రావమైంది. కుటుంబసభ్యులు వెంటనే ఆమెను ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
మార్గ మధ్యలోనే వనజ ప్రాణాలు కోల్పోయింది. తల్లీబిడ్డల మృతితో తీవ్ర విషాదంలో మునిగిపోయిన కుటుంబసభ్యులు ఇంటికి వచ్చి కన్నీళ్లతో వనజకు దహన సంస్కారాలు నిర్వహించారు. అంత్యక్రియలు పూర్తయ్యాక చితాభస్మంలో ఆపరేషన్ చేసే సమయంలో వాడే కత్తెర లభ్యం కావడంతో కుటుంబసభ్యులు దిగ్భ్రాంతికి గురయ్యారు. వనజకు కాన్పు చేసే సమయంలోనే దీన్ని మర్చిపోయి ఉంటారని, ఆస్పత్రి నిర్లక్ష్యం వల్లే తల్లీబిడ్డలు మరణించారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే గుండాల వైద్యాధికారిని సస్పెండ్ చేసింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తల్లీ బిడ్డలు మృతి చెంది ఉంటారని స్థానికంగా తీవ్ర చర్చ నడుస్తోంది.

