కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాలోని గుండాల (Gundala) మండలం శంభునిగూడెంలో తీవ్ర కలకలం రేపిన గర్భిణి వనజ మృతి ఉదంతంలో ఒక నమ్మలేని నిజం వెలుగుచూసింది. వైద్యుల నిర్లక్ష్యానికి పరాకాష్టగా నిలిచే ఒక సంచలన విషయం ఇప్పుడు స్థానికంగా తీవ్ర దుమారం రేపుతోంది.
గుండాల మండలం శంభునిగూడెం గ్రామానికి చెందిన గర్భిణి వనజ ఈ నెల 13న ప్రసవానంతరం మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆమె అంత్యక్రియల అనంతరం, కుటుంబ సభ్యులు సాంప్రదాయం ప్రకారం చితా భస్మం సేకరిస్తుండగా.. అక్కడ ఒక కత్తెర (సర్జికల్ సిజర్స్) బయటపడటం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రసవ సమయంలో వైద్యులు నిర్లక్ష్యంగా కత్తెరను ఆమె కడుపులోనే మరచిపోయి ఉంటారని, ఆ కారణం చేతనే వనజ మృతి చెంది ఉంటుందని కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యులైన వైద్య సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ తీవ్ర ఆరోపణలపై జిల్లా ఆరోగ్య అధికారి ప్రతాప్ స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… మృతి చెందిన వనజకు ఎటువంటి మేజర్ సర్జరీ జరగలేదని, ఆమెకు కేవలం నార్మల్ డెలివరీ మాత్రమే అయిందని స్పష్టం చేశారు. నార్మల్ డెలివరీ జరిగిన క్రమంలో కడుపులో కత్తెర ఎలా ఉండిపోతుందనే కోణంలో అధికారులు విచారణ జరుపుతున్నారు. అయితే, చితా భస్మంలో కత్తెర లభ్యం కావడంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతుండటంతో, ఈ ఘటనపై ఉన్నతాధికారులు సమగ్ర దర్యాప్తునకు ఆదేశించే అవకాశం ఉంది.
Read Also: అక్కడ బీచ్లో నిద్రపోతున్న జనం.. ఎందుకంటే?
Follow Us On : WhatsApp

