కలం, మెదక్ బ్యూరో : ప్రభుత్వ భూముల ఆక్రమణలపై, అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా (HYDRA) అధికారులు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు (Patancheru) నియోజకవర్గంలో మరోసారి రంగంలోకి దిగారు. పటాన్చెరు పరిధిలోని మంజీరా వాటర్ వర్క్స్, ఐలా కు సంబంధించిన ప్రభుత్వ భూమిలో వెలిసిన నిర్మాణాలను శుక్రవారం ఉదయం నుండి భారీ బందోబస్తు నడుమ కూల్చివేస్తున్నారు.
మంజీరా వాటర్ వర్క్స్, ఐలా పరిధిలోని సుమారు 1599 గజాల ప్రభుత్వ స్థలాన్ని కొందరు ఆక్రమించుకున్నట్లు గుర్తించిన హైడ్రా అధికారులు, ఆ స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకునే ప్రక్రియ చేపట్టారు. ఆక్రమణలను తొలగించి, సదరు ప్రభుత్వ స్థలం చుట్టూ ఫెన్సింగ్ వేసే పనులను అధికారులు వేగవంతం చేశారు. ఇదే ప్రభుత్వ స్థలంలో స్థానిక కన్యాకాపరమేశ్వరి ఆలయానికి సంబంధించిన ప్రహరీ కూడా ఉండటంతో అధికారులు దాన్ని జేసీబీలతో కూల్చివేశారు.
ఈ కూల్చివేత ఉదంతం స్థానికంగా రాజకీయంగానూ చర్చనీయాంశంగా మారింది. కేవలం నిన్ననే కన్యాకాపరమేశ్వరి ఆలయ గడప ప్రతిష్ఠ కార్యక్రమానికి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, ఆలయ అభివృద్ధికి తన వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే హామీ ఇచ్చిన మరుసటి రోజే హైడ్రా అధికారులు ఆలయ ప్రహరీ కూల్చివేయడం స్థానికంగా చర్చనీయంగా మారింది.

