కలం, వెబ్ డెస్క్: టైటిల్ గెలిచారు.. కానీ ప్రైజ్ మనీ మాత్రం దక్కలేదు. నాలుగు నెలలుగా నిర్వాహకుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం కనిపించలేదు. దీంతో గ్రాండ్మాస్టర్ అభిజీత్ గుప్తా (Abhijeet Gupta) కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖను ఆశ్రయించారు. తన దక్కాల్సిన ప్రైజ్మనీని అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అర్జున అవార్డు గ్రహీత, గ్రాండ్మాస్టర్ అభిజీత్ గుప్తాకు ఆవేదన చూసిన నెటిజన్లు చలించిపోతున్నారు. క్రికెట్కు దక్కే ప్రాధాన్యంలో ఇతర క్రీడలు 10శాతం కూడా దక్కడం లేదని వాళ్లు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఈ ఏడాది జనవరిలో జరిగిన ‘ఒడిశా ఓపెన్’ గెలిచిన ఆయనకు రావాల్సిన 5.5 లక్షల రూపాయల బహుమతి సొమ్ము ఇప్పటికీ అందలేదు. నెల రోజుల్లో ఇస్తామని చెప్పిన నిర్వాహకులు.. ఆ తర్వాత స్పందించడం మానేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒడిశా చెస్ అసోసియేషన్లో అంతర్గత గొడవలు జరుగుతున్నాయి. ఈ విభేదాల వల్ల వారి బ్యాంక్ ఖాతాలు ఫ్రీజ్ అయ్యాయని, అందుకే పేమెంట్ చేయలేకపోతున్నామని సమాచారం. ఈ విషయంపై అభిజీత్ భారత చెస్ సమాఖ్యకు (AICF) ఫిర్యాదు చేసినా స్పందన రాలేదు.
తనలాంటి సీనియర్ క్రీడాకారుడికే ఇలాంటి పరిస్థితి వస్తే, సామాన్య క్రీడాకారుల పరిస్థితి ఏంటని ఆయన సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. ఆటలో గెలుపోటములు సహజమని, కానీ గెలిచిన సొమ్ము కోసం ఇలా పోరాడటం బాధాకరమని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై స్పందించిన ఏఐసీఎఫ్ అధికారులు.. త్వరలోనే సమస్యను పరిష్కరించి అభిజీత్ కు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

