కలం, ఖమ్మం బ్యూరో: పేదోళ్ల సొంతింటి కల నెరవేర్చడంలో రాజీపడబోమని, మే నెలాఖరు నుంచి రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు మంజూరు ప్రక్రియ ప్రారంభించనున్నట్లు మంత్రి పొంగులేటి (Minister Ponguleti) శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. శనివారం ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద నిర్వహించిన ప్రజా దర్బార్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన (Minister Ponguleti) మాట్లాడుతూ.. ఇప్పటికే పాలేరు నియోజకవర్గంలో 10 క్లస్టర్లలో ప్రజాదర్బార్ నిర్వహించామన్నారు. ఇప్పటివరకు 14,700 దరఖాస్తులు వచ్చాయని, అందులో ఎక్కువగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన అప్లికేషన్లే ఉన్నాయన్నారు. ప్రజాప్రభుత్వం నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల (Indiramma Indlu) పట్ల ప్రజలు ఆకర్షితులవుతున్నారానడానికీ ఇదే నిదర్శనమన్నారు. అలాగే వరి, మొక్కజొన్న పండించే రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి భరోసా ఇచ్చారు. వీలైనంత తొందరగా ధాన్యం కొనుగోలు చేసి రైతన్నలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
గత ప్రభుత్వ నిర్ణయాల వల్ల ధరణి పోర్టల్ రైతులకు శాపంగా మారిందని పొంగులేటి విమర్శించారు. ధరణి తప్పులను సరిదిద్దడానికి ‘భూ భారతి’ తెచ్చామని వివరించారు. సాదాబైనామా దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి పేదలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మద్దులపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ హరినాథ్ బాబు, ఆత్మ కమిటీ చైర్మన్, జిల్లా స్థాయి అధికారులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
Read Also: రేపు పవన్ కళ్యాణ్ను పరామర్శించనున్న ప్రధాని మోదీ?
Follow Us On: WhatsApp

