కలం, వెబ్డెస్క్: తన కుమారుడిపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) స్పందించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ పోస్టు చేశారు. తన కొడుకుపై వస్తున్న ఆరోపణలన్నీ నిరాధారమని, రాజకీయంగా తనను ఎదుర్కోలేక ప్రత్యర్థులు తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకున్నారని ఆయన మండిపడ్డారు. తనకు భారత రాజ్యాంగం, న్యాయ వ్యవస్థపై పూర్తి విశ్వాసం ఉందని, దశాబ్దాల తన రాజకీయ జీవితం నిష్కళంకమైనదని ఆయన స్పష్టం చేశారు. అట్టడుగు స్థాయి నుంచి వచ్చిన ఒక బీసీ నాయకుడు కేంద్ర మంత్రి స్థాయికి ఎదగడాన్ని జీర్ణించుకోలేక కొన్ని శక్తులు ఇలాంటి కుట్రలకు తెరతీశాయని ఆయన ఆరోపించారు.
ముఖ్యంగా రేపు హైదరాబాద్లో ప్రధానమంత్రి మోదీ బహిరంగ సభ ఉన్న తరుణంలో తనను వ్యక్తిగతంగా అప్రతిష్టపాలు చేయడమే ఈ కుట్రల వెనకున్న అసలు లక్ష్యమని బండి సంజయ్ పేర్కొన్నారు. తప్పేదో, ఒప్పేదో న్యాయవ్యవస్థే నిర్ణయిస్తుందని, సమయం వచ్చినప్పుడు ప్రతి ఆరోపణలకు సమాధానం దొరుకుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తన రాజకీయ ప్రస్థానంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటానని, చివరకు నిజమే గెలుస్తుందని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు.

