కలం, వెబ్ డెస్క్: తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly) బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఇరు సభలను ఉద్దేశించి గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా (Shiv Pratap Shukla) ప్రసంగిస్తున్నారు. హైదరాబాద్ మహా నగర అభివృద్ధి కోసం తీసుకుంటున్న చర్యలపై గవర్నర్ కీలక వ్యాఖ్యలు చేశారు. జీహెచ్ఎంసీ (GHMC)ని మూడు కార్పొరేషన్లుగా విభజించామని గవర్నర్ చెప్పారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. కాలుష్యాన్ని నివారించాలన్న ఉద్దేశంతో నగరం నడిబొడ్డున ఉన్న పరిశ్రమలను శివారు ప్రాంతాలకు తీసుకెళ్లేలా హిల్ట్ పాలసీ తీసుకొచ్చామన్నారు. రాష్ట్రాన్ని క్యూర్, ప్యూర్, రేర్గా డివైడ్ చేశామని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల జీవన ప్రమాణాల పెంపు, ఆర్థిక వ్యవస్థ పరిపుష్టి లక్ష్యాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకున్నామని గవర్నర్ తెలిపారు.
ప్రభుత్వం రీజినల్ రింగు రోడ్డును కనెక్ట్ చేసేలా రేడియల్ రోడ్ల నిర్మాణాన్ని చేపడుతున్నదని గవర్నర్ వెల్లడించారు. ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ అనుసంధానం జరుగుతుందని తెలిపారు. అమరావతిని కనెక్ట్ చేసేలా గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవేను నిర్మిస్తున్నామని గవర్నర్ వెల్లడించారు. ఫ్యూచర్ సిటీకి అనుసంధానంతో పాటు ఏపీలోని బందరు పోర్టుకు కనెక్టివిటీ ఉంటుందన్నారు. బుల్లెట్ ట్రెయిన్ హబ్గా శంషాబాద్ను నెలకొల్పాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు చెప్పారు. ఎయిర్ కనెక్టివిటీ కల్పించేందుకు వరంగల్, ఆదిలాబాద్లో రెండు విమానాశ్రయాలను నిర్మించేలా కేంద్రానికి ప్రతిపాదనలు చేశామన్నారు. ఫ్యూచర్ సిటీ అభివృద్ధి కోసం గతేడాది మార్చి 12న అథారిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మూసీ అభివృద్ధి కోసం ఫస్ట్ ఫేజ్ ప్లాన్ సిద్ధంగా ఉందన్నారు. హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 55 కి.మీ. మేర మూసీని పునరుజ్జీవం చేసి డెవలప్ చేస్తామని వెల్లడించారు. ప్రజలకు భద్రత కల్పించేందుకు, శాంతిభద్రతలను మెయింటెయిన్ చేసేందుకు నాలుగు పోలీసు కమిషనరేట్లను ఏర్పాటు చేసినట్లు గవర్నర్ (Shiv Pratap Shukla) వివరించారు.
Read Also: కుప్పకూలుతున్న బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?
Follow Us On: Facebook

