కలం, స్పోర్ట్స్: ఆస్ట్రేలియా తరఫున అరంగేట్రం చేస్తున్న నిఖిల్ చౌదరి (Nikhil Chaudhary) ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారాడు. భారత్లో పుట్టిన ఈ క్రికెటర్, బంగ్లాదేశ్తో తొలి టీ20 మ్యాచ్లో ఆస్ట్రేలియా ప్లేయింగ్ ఎలెవన్లో చోటు దక్కించుకుని అరుదైన ఘనత సాధించాడు. దాదాపు ఆరు దశాబ్దాల తర్వాత ఆస్ట్రేలియా పురుషుల జట్టుకు ఆడుతున్న తొలి ఇండియన్ నిఖిల్ కావడం విశేషం. చివరిసారిగా 1964లో గుజరాత్లో జన్మించిన రెక్స్ సెల్లార్స్ ఆస్ట్రేలియా తరఫున ఆడాడు.
ఢిల్లీలో జన్మించిన నిఖిల్ (Nikhil Chaudhary), 2017 నుంచి 2019 వరకు పంజాబ్ తరఫున దేశీయ క్రికెట్ ఆడాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీల్లో కలిపి 14 మ్యాచ్లు ఆడాడు. 2020లో తన మామను కలవడానికి ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్కు వెళ్లాడు. అయితే కోవిడ్ లాక్డౌన్ కారణంగా భారత్కు తిరిగి రాలేకపోయాడు. అదే అతని జీవితంలో కీలక మలుపుగా మారింది. ఆంక్షలు సడలిన తర్వాత బ్రిస్బేన్లో క్లబ్ క్రికెట్ ఆడడం ప్రారంభించాడు.
జీవనోపాధి కోసం రెస్టారెంట్లలో కూరగాయలు కోయడం, టాక్సీ నడపడం, పార్సిళ్లు డెలివరీ చేయడం లాంటి పనులు చేశాడు. మరోవైపు క్రికెట్పై పూర్తిగా దృష్టి పెట్టాడు. అతని ప్రదర్శనలు స్థానిక కోచ్లను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఆ కష్టానికి ఫలితం దక్కింది. భారత్లో మొదలైన అతని క్రికెట్ ప్రయాణం, ఆస్ట్రేలియా జాతీయ జట్టు వరకు చేరి కొత్త చరిత్రను సృష్టించింది.
Read Also: మెస్సీ కంటతడి వెనుక కారణం ఇదే..
Follow Us On: X(Twitter)

