కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో ధాన్యం కొనుగోళ్ళ జాప్యంపై నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. శుక్రవారం నిజామాబాద్ రూరల్ నియోజక వర్గంలో ఆందోళన చేస్తే శనివారం ఆర్మూర్ (Armoor) లో అన్నదాతలు ఆందోళనకు దిగారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్లో స్థానిక రైతన్నలు రోడ్డెక్కారు.
సకాలంలో ప్రభుత్వం వరి ధాన్యాన్ని కొనుగోలు చెయ్యడం లేదని, ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో తీవ్ర జాప్యం చేస్తుందని రైతులు మండిపడ్డారు. రైతులు పండించిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై ధర్నాకు దిగారు. కొనుగోలు కేంద్రాల్లో హమాలీల కొరత లేకుండా చూడాలని, అదే విధంగా తరుగు లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనను తీవ్ర స్థాయికి తీసుకెళ్లి ప్రభుత్వం దిగొచ్చేదాకా ధర్నాలు, రాస్తారోకోలు కొనసాగిస్తామని రైతులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

