గ్లాస్గో రింగ్‌లో ‘భారత్’ పంచ్ పవర్

కలం, స్పోర్ట్స్​ : గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో (Commonwealth Games) భారత బాక్సర్లు సంచలన ప్రదర్శనతో దుమ్మురేపారు. శనివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌ల్లో భారత్‌కు చెందిన ప్రీతి పవార్, జైస్మిన్ లాంబోరియా పసిడి పతకాలతో విజృంభించగా, జాదుమణి సింగ్ రజత పతకాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. బాక్సింగ్ రింగ్‌లో స్వర్ణ శంఖారావం మహిళల 54 కేజీల ఫైనల్ పోరులో ప్రపంచ మూడో రేంక్ బాక్సర్ ప్రీతి పవార్ రింగ్‌లోకి దిగిన తొలి క్షణం నుంచే ప్రత్యర్థిపై విరుచుకుపడ్డారు.

కెనడా బాక్సర్ స్కార్లెట్ డెల్గాడోకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా రౌండ్-1 నుంచే కంబైన్డ్ పంచ్‌లతో విరుచుకుపడ్డారు. ఐదుగురు జడ్జిల నుంచి 10-8 పాయింట్లు సాధించిన ప్రీతి, చివరికి 5-0తో ప్రత్యర్థిని క్లీన్ స్వీప్ చేసి భారత్‌కు తొలి స్వర్ణ పతకాన్ని అందించారు. వెంటనే జరిగిన మహిళల 57 కేజీల ఫైనల్ సమరంలో ప్రపంచ ఛాంపియన్ జైస్మిన్ లాంబోరియా నార్తర్న్ ఐర్లాండ్‌కు చెందిన డిఫెండింగ్ ఛాంపియన్ మైఖేలా వాల్ష్‌ను చిత్తు చేశారు.

మొదటి రౌండ్‌లో కొంత పోటీ ఎదురైనప్పటికీ, రెండో రౌండ్‌లో జైస్మిన్ విసిరిన పంచ్‌లకు ప్రత్యర్థి తేలిపోయారు. దీంతో జైస్మిన్ కూడా 5-0తో అద్భుత విజయం సాధించి రెండో స్వర్ణాన్ని దేశానికి అందించారు. హోరాహోరీ పోరులో జాదుమణి రజతం మరోవైపు పురుషుల 55 కేజీల ఫైనల్ మ్యాచ్‌లో జాదుమణి సింగ్ ఆస్ట్రేలియా బాక్సర్ జై డిక్సన్‌తో తలపడ్డారు. ప్రత్యర్థి పొడగరి అయినప్పటికీ ఏమాత్రం తగ్గకుండా ఆడిన జాదుమణి తొలి రౌండ్‌ను 3-2తో కైవసం చేసుకున్నారు.

అయితే ఆ తర్వాత కోలుకున్న ఆస్ట్రేలియా బాక్సర్ తన ఆధిక్యాన్ని ప్రదర్శించి విజయాన్ని అందుకున్నారు. దీంతో జాదుమణికి 0-5తో రజత పతకం దక్కింది. సెమీఫైనల్స్‌లో తిరుగులేని విజయం ఫైనల్స్‌కు ముందు శుక్రవారం జరిగిన సెమీఫైనల్స్ మ్యాచ్‌ల్లోనూ భారత బాక్సర్లు అదరగొట్టారు. 55 కేజీల విభాగంలో జాదుమణి సింగ్ నమీబియాకు చెందిన ఫిలిప్ హావోసెబ్‌పై 5-0 తేడాతో ఏకగ్రీవ విజయం సాధించి ఫైనల్లో అడుగుపెట్టారు. అలాగే 22 ఏళ్ల ప్రీతి పవార్ సెమీస్‌లో జాంబియా బాక్సర్ క్యాథరిన్ మ్వాపేను 5-0తో ఓడించి టైటిల్ ఫైట్‌కు అర్హత సాధించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>