కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) పోలీస్ కమిషనరేట్లోని రామడుగు పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల జరిగిన వరుస దేవాలయ చోరీలను పోలీసులు ఛేదించారు. కరీంనగర్ ఏసీపీ కార్యాలయంలో అదనపు డీసీపీ వెంకటరమణ వివరాలు వెల్లడించారు. జగిత్యాల జిల్లా పొలాస గ్రామానికి చెందిన ఎం.ఎ.అర్షద్ ఖాన్ అంతర్ జిల్లా దొంగ. కరీంనగర్లో కూలీ పని చేస్తూ సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో దేవాలయాలను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నాడు. జులై 25, 26వ తేదీల్లో వెదిర గ్రామంలోని లక్ష్మీ గణపతి, మార్కండేయ స్వామి దేవాలయాల్లో తాళాలు పగులగొట్టి బంగారం, వెండి వస్తువులు, హుండీ నగదు దొంగిలించాడు.
వెండి కిరీటాలు స్వాధీనం..
సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాల ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించినట్లు అదనపు డీసీపీ వెంకటరమణ తెలిపారు. అతని వద్ద మూడు వెండి కిరీటాలు, నాలుగు వెండి జంజీరాలు, బంగారు పుస్తెలు, రూ.9,500 నగదు, ద్విచక్ర వాహనం, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నామని వివరించారు. జ్యువెలరీ దుకాణంలో విక్రయించిన మరికొన్ని ఆభరణాలను కూడా రికవరీ చేశామన్నారు.
నిందితుడు చిగురుమామిడి, ఎల్ఎండీ కాలనీ, రామడుగు, చొప్పదండి, గంగాధర పోలీస్స్టేషన్ల పరిధిలోని పలు దేవాలయాలు, తాళం వేసిన ఇళ్లల్లో చోరీలకు పాల్పడినట్లు అంగీకరించినట్లు అదనపు డీసీపీ వెంకటరమణ వివరించారు. చోరీ సొత్తును విక్రయించగా వచ్చిన డబ్బును వ్యక్తిగత అవసరాలు, మందు తాగడానికి ఖర్చు చేసినట్లు తెలిపారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచామని.. మిగిలిన చోరీ సొత్తు స్వాధీనం కోసం ప్రత్యేక బృందాలతో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు వివరించారు. కేసును త్వరితగతిన ఛేదించిన పోలీసు అధికారులను అదనపు డీసీపీ అభినందించారు.

