కలం, స్పోర్ట్స్ : ఐపీఎల్ 2026 సీజన్ ఉత్సాహంగా సాగుతున్నా, స్టేడియంలో ఎంఎస్ ధోనీ (MS Dhoni) కనిపించకపోవడం అభిమానులను కాస్త నిరాశకు గురిచేస్తోంది. కాలి గాయం నుండి కోలుకుంటున్న ధోనీ, కనీసం మ్యాచ్ చూడటానికి కూడా రావడం లేదు. దీంతో ధోనీ ఎందుకు రావడం లేదు? ఎందుకు ఆడటం లేదు? అసలు ఏమైంది? అన్న ప్రశ్నలు అభిమానులను అతలాకుతలం చేస్తున్నాయి. తాజాగా ఈ ప్రశ్నలకు చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ కోచ్ మైకేల్ హస్సీ (Michael Hussey) క్లారిటీ ఇచ్చారు.
ధోనీ స్టేడియానికి రాకపోవడానికి ప్రధాన కారణం జట్టుకు ఎలాంటి ఆటంకం కలగకూడదనేనని హస్సీ పేర్కొన్నారు. ధోనీ మైదానంలో ఉంటే కెమెరాలు, ప్రేక్షకుల ఫోకస్ అంతా ఆయనపైనే ఉంటుందని, దీనివల్ల ఆడుతున్న ఆటగాళ్ల నుండి దృష్టి మళ్లుతుందని ధోనీ భావిస్తున్నట్లు హస్సీ తెలిపారు. జట్టు ప్రయోజనాలకే ధోనీ ఎప్పుడూ ప్రాధాన్యత ఇస్తారని, అందుకే తాను లైమ్లైట్లో ఉండి ఆటగాళ్లను ఇబ్బంది పెట్టకూడదని ఆయన నిర్ణయించుకున్నట్లు వివరించారు.
మ్యాచ్ రోజుల్లో స్టేడియంలో కనిపించకపోయినప్పటికీ, ధోనీ ఇప్పటికీ జట్టులో భాగంగానే ఉన్నారని హస్సీ చెప్పారు. ఇంటి వద్ద నుండే మ్యాచ్లను నిశితంగా గమనిస్తూ, డ్రెస్సింగ్ రూమ్లో ఆటగాళ్లకు అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తూ వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతున్నారని తెలిపారు. ధోనీ లాంటి అనుభవజ్ఞుడు జట్టుతో ఉండటం మిగిలిన ఆటగాళ్లకు ఎంతో బలాన్నిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
నిజానికి గత నెలలోనే ధోనీ మైదానంలోకి తిరిగి రావాల్సి ఉంది. అయితే ప్రాక్టీస్ మ్యాచ్ సమయంలో ఆయన కాలి గాయం మరోసారి తిరగబెట్టడంతో పునరాగమనం ఆలస్యమైంది. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని, జట్టు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతానికి మ్యాచ్లకు దూరంగా ఉంటున్నారని తెలుస్తోంది.

