కలం, వెబ్ డెస్క్: విజిలెన్స్ అధికారులమంటూ (Fake Vigilance Officers) బెదిరించి గ్యాస్ డెలివరీ బాయ్ దగ్గర కొందరు కేటుగాళ్లు డబ్బులు వసూలు చేశారు. ఈ ఘటన హైదరాబాద్లోని ఫిల్మ్నగర్ ఎంఆర్సీ కామన్ వద్ద చోటు చేసుకున్నది. వసూళ్లకు పాల్పడింది మీడియా ప్రతినిధులు కావడం గమనార్హం. మొహమ్మద్ మన్జూర్ హసన్ (60) (న్యూస్ 9 చానల్), మొహమ్మద్ తౌసీఫ్ (46) – (బీటీఎస్ న్యూస్ వెబ్ చానల్ రిపోర్టర్), మరో వ్యక్తి మొహమ్మద్ తాజ్ (29) అనే ముగ్గురు వ్యక్తులు తాము విజిలెన్స్ అధికారులంటూ పలు చోట్ల డబ్బులు వసూలు చేస్తున్నట్టు సమాచారం.
ఈ క్రమంలో సోమవారం ఈ ముఠా ఓ గ్యాస్ సిలిండర్ డెలివరీ బాయ్ని బెదిరించి రూ. 2 లక్షలు డిమాండ్ చేశారు. గ్యాస్ సిలిండర్లు బ్లాక్లో అమ్ముతున్నావంటూ బెదిరించారు. ఈ విషయం యజమానికి చెబితే ఉద్యోగం పోతుందని బెదిరించి డబ్బు డిమాండ్ చేశారు. భయపడ్డ డెలివరీ బాయ్ తాను సేకరించిన నగదును వారికి అప్పగించాడు. అనంతరం జరిగిన విషయం యజమానికి చెప్పడంతో ఫిల్మ్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా పోలీసులు నిందితులను (Fake Vigilance Officers) గుర్తించి అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.23 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన డబ్బు మరో వ్యక్తి వద్ద ఉన్నట్లు విచారణలో వెల్లడైంది. ప్రస్తుతం ఆ నిందితుడి కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
Read Also: నేను విదేశీ ప్లేయర్నా?: వైరల్ జోక్స్పై విరాట్ కోహ్లీ ఫన్నీ రియాక్షన్
Follow Us On: Facebook

