కలం, మెదక్ బ్యూరో: సిద్దిపేట (Siddipet) జిల్లాలో ప్రమాదవశాత్తు పొలాల్లో చెలరేగిన మంటలు రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చాయి. దుబ్బాక మండలం పెద్దగుండవెల్లి (Peddagundavelly) గ్రామంలో రెండు కరెంట్ వైర్లు ఒకదానికి ఒకటి తాకడంతో నిప్పులు చెలరేగి మంటలు అంటుకున్నాయి. ఈ మంటలు పెద్దఎత్తున రైతుల పొలాల్లోకి వేగంగా వ్యాపించాయి.
గమనించిన రైతులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. కానీ మంటలు భారీగా చెలరేగడంతో అదుపులోకి రాలేదు. మంటల దాటికి బోరు మోటర్లు పైపులు, వ్యవసాయ సామగ్రి దగ్ధమైపోయాయి. రైతులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటను ఆర్పేందుకు ప్రయత్నించారు. ఈ అగ్నిప్రమాదంతో తాము తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫ్రభుత్వం స్పందించి ఆదుకోవాలని కోరుతున్నారు.

