Mobile Popup Ad
Mobile Popup Ad

నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తారు: బొత్స

కలం, వెబ్ డెస్క్: కూటమి ప్రభుత్వం మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందని మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana)  ఆరోపించారు. ఎన్నికల ముందు నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చారని.. ఆ హామీ ఏమైందని ప్రశ్నించారు. ఒక్క హామీ అయినా నెరవేర్చారా? అంటూ ప్రశ్నించారు. విద్యాలయాలను వైసీపీ హయాంలో బాగు చేస్తే ఇప్పుడు కూటమి ప్రభుత్వం నాశనం చేస్తోందని ఫైర్ అయ్యారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విద్యాశాఖ మంత్రి లోకేశ్ .. తన శాఖ గురించి కాకుండా ఇతర శాఖ గురించి మాట్లాడుతున్నారని పేర్కొన్నారు.

హామీలు ఏమయ్యాయి?

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలపై భారం మోపుతున్నారని ఆయన ఆరోపించారు. “యుద్ధం పేరుతో ప్రజలపై ఇష్టారీతిన భారాలు పెంచుతున్నారు” అని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయని పేర్కొన్నారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ఆయన నిలదీశారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఇష్టారీతిన కేసులు నమోదు చేస్తున్నారని కూడా ఆయన విమర్శించారు. మెగా డీఎస్సీ పేరుతో యువతను మోసం చేశారని బొత్స ఆరోపించారు. ఉద్యోగాల భర్తీపై స్పష్టమైన ప్రణాళిక లేకుండా ప్రకటనలు మాత్రమే చేస్తున్నారని ఆయన అన్నారు.

దాపరిక పాలన నడుస్తోంది

గత వైసీపీ పాలనలో, ముఖ్యంగా కరోనా సమయంలో ప్రజలను సమర్థవంతంగా ఆదుకున్నామని బొత్స సత్యనారాయణ గుర్తుచేశారు. ఆ సమయంలో ప్రతి అవసరాన్ని ప్రభుత్వం దగ్గరుండి చూసుకుందని ఆయన అన్నారు. విద్యాశాఖలో పారదర్శకత లేకుండా పాలన కొనసాగుతోందని విమర్శించారు. ప్రభుత్వ పాలనను ఆయన “దాపరిక పాలన”గా అభివర్ణించారు. కీలక నిర్ణయాలు ప్రజలకు తెలియకుండా తీసుకుంటున్నారని, పారదర్శకత పూర్తిగా లోపించిందని బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రభుత్వం మాటలు కోటలు దాటుతున్నాయి కానీ పనులు మాత్రం కనిపించడం లేదని ఆయన వ్యాఖ్యానించారు.

ప్రభుత్వ భూములు దోచుకున్నారు

గీతం యూనివర్సిటీ ప్రభుత్వ భూమిని దోచుకునేందుకు కుట్రలు చేస్తోందని బొత్స ఫైర్ అయ్యారు. విద్యా రంగాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నారని విమర్శించారు. జగన్ పాలనలో ప్రతి స్కూల్ ప్రారంభ రోజున విద్యా కానుక అందించామని బొత్స గుర్తుచేశారు. ఇప్పుడు విద్యా కానుక విషయంలో క్లారిటీ లేదన్నారు. ప్రస్తుతం పథకాలు సక్రమంగా అమలు కావడం లేదని ఆయన ఆరోపించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం బ్రాండ్ ఇమేజ్‌ను ప్రభుత్వం దెబ్బతీస్తోందని బొత్స సత్యనారాయణ విమర్శించారు. ఉన్నత విద్యా సంస్థల ప్రతిష్టను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>