కలం, క్రైమ్ బ్యూరో : హీరా గ్రూప్ అధినేత, ప్రధాన నిందితురాలు నౌహీరాషేక్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఆమెను విచారణ నిమిత్తం శుక్రవారం హైదరాబాద్కు తరలించారు. స్కీముల పేరిట రూ.వేల కోట్లు స్వాహా చేసినట్లు నౌహీరా షేక్పై అభియోగాలున్నాయి. అక్రమంగా డిపాజిట్ల సేకరణ, విదేశీ బ్యాంకు ఖాతాల నిర్వహణ ఆరోపణలతో తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక సహా పలు రాష్ట్రాల్లో ఆమెపై కేసులు నమోదయ్యాయి.
హీరా గ్రూప్ సంస్థల ద్వారా ఏడాదికి 36 శాతం చొప్పున అధిక లాభాలు ఇస్తామని నమ్మించి, దేశవ్యాప్తంగా లక్షలాది మంది డిపాజిటర్ల నుండి సుమారు రూ. రూ. 5,978 కోట్లు వసూలు చేశారు. పలు రాష్ట్రాల్లో కేసులు నమోదు కావడంతో ఈడీ రంగంలోకి దిగింది. మనీ లాండరింగ్ కింద ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతుంది.ఇప్పటికే రూ.400 కోట్లకు పైగా విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేసింది. అయితే బాధితులకు డబ్బులు తిరిగి చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ ఆమె నుంచి స్పందన లేకపోవడంతో, సర్వోన్నత న్యాయస్థానం ఆమె బెయిల్ను రద్దు చేసి సరెండర్ కావాలని స్పష్టం చేసింది.
కానీ నౌహీరాషేక్ మాత్రం కోర్టు ఆదేశాలను బేఖాతరు చేసి తప్పించుకొని తిరుగుతున్నారు. నకిలీ ధ్రువపత్రాలు సృష్టించుకొని ఆమె హరియణలోని గురుగ్రామ్లో ఉంటున్నట్లు ఈడీకి సమాచారం అందింది. దీంతో హరియణ పోలీసులతో కలిసి ఈడీ సంయుక్తంగా జాయింట్ ఆపరేషన్ చేపట్టి నౌహీరాషేక్ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆమెను హైదరాబాద్కు తరలించారు.

