కలం, వెబ్ డెస్క్ : దేశ రాజధాని ఢిల్లీలోని (Delhi) మాల్వియా నగర్ లెమన్ గ్రీన్ రెస్టారెంట్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగి 21 మంది ప్రాణాలు కోల్పోవడంపై ప్రధాని మోదీ (PM Modi) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అగ్ని ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం అని.. ఈ ఘటన తనను ఎంతగానో కలచివేసిందని చెప్పారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు వెల్లడించారు. మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి రూ. 2 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా అందించనున్నట్లు ప్రకటించారు.
అలాగే, ఈ ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు త్వరగా కోలుకోవాలని ప్రధాని మోదీ (PM Modi) ఆకాంక్షించారు. గాయపడిన బాధితులకు రూ. 50,000 చొప్పున పరిహారం అందజేయనున్నట్లు తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై ఢిల్లీ సీఎం రేఖా గుప్తా (Rekha Gupta) కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన సీఎం.. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
కాగా, మాల్వియా నగర్ లెమన్ గ్రీన్ రెస్టారెంట్లో అగ్ని ప్రమాద ఘటనలో ఉల్లంఘనలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. రెస్టారెంట్ లైసెన్స్ 6 గదులకి తీసుకుని 25 గదులు కట్టినట్లు తేలింది. రెస్టారెంట్కి సరైన ఎంట్రీ, ఎగ్జిట్ లేని కారణంగా మృతుల సంఖ్య పెరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఇప్పటికే 21 మంది సజీవదహనం కాగా.. 40 మందిని అగ్నిమాపక సిబ్బంది కాపాడింది. అయితే క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం అందుతోంది. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
Read Also: రవితేజ ‘ఇరుముడి’ గ్లింప్స్కు సూపర్ రెస్పాన్స్
Follow Us On : WhatsApp

