కలం, వరంగల్ బ్యూరో : కుడా ప్లాట్ల వేలంలో భారీ అవినీతి జరిగిందని, ప్రభుత్వానికి రూ.50 కోట్ల నష్టం కలిగేలా సిండికేట్గా వ్యవహరించి తక్కువ ధరలకు ప్లాట్లను కట్టబెట్టారని మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ (Dasyam Vinay Bhaskar) ఆరోపించారు. శుక్రవారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రెండున్నరేళ్లుగా ఏ సమస్య వచ్చినా బీఆర్ఎస్పైనే ఆరోపణలు చేయడం కాంగ్రెస్ నాయకులకు అలవాటైందని దాస్యం వినయ్ భాస్కర్ విమర్శించారు.
420 హామీలు, ఆరు గ్యారంటీల అమలును మరిచిపోయి, అభివృద్ధికి బదులుగా కుడా పేరిట అవినీతికి తెరలేపారని ఆరోపించారు. ప్రపంచమంతా ఆన్లైన్ విధానాన్ని అనుసరిస్తుంటే కుడా ప్లాట్ల వేలాన్ని ఆఫ్లైన్లో నిర్వహించడం వెనుక పెద్ద కుట్ర ఉందన్నారు. ప్రతిపక్షాలపై కేసులు, దాడులు, కూల్చివేతలు కాకుండా మిగిలిన కాలంలో అభివృద్ధిపై దృష్టి పెట్టాలని ప్రభుత్వానికి వినయ్ భాస్కర్ (Dasyam Vinay Bhaskar) సూచించారు.
యాదవ్నగర్–రెడ్డిపురం మార్గంలోని చెరువును చట్టాలకు విరుద్ధంగా పూడ్చివేస్తున్నారని, దీంతో అక్కడి పక్షులు, జలచరాల మనుగడ ప్రమాదంలో పడిందని అన్నారు. పేదల ఇళ్లను కూల్చడం మానేసి వారికి ఇంటి పట్టాలు ఇవ్వాలని, డబుల్ బెడ్రూం ఇళ్లను స్థానిక అర్హులకే కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కూడా మాజీ చైర్మన్ మర్రి యాదవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Also: ‘రెడ్ జోన్’ లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. ఈసారి వారికి టికెట్ డౌటే!
Follow Us On: Instagram

