కలం, వెబ్ డెస్క్: ఏపీలో మెగా డీఎస్సీ నియమకాల చుట్టూ రాజకీయ వివాదం కొనసాగుతోంది. మెగా డీఎస్సీ నియామకాల్లో జరిగిన అవకతవకల్ని మండలి వేదికగా ఎత్తి చూపాలని వైసీపీ ఎమ్మెల్సీలకు ఆ పార్టీ అధినేత జగన్ దిశానిర్దేశం చేశారు. ఈ తరుణంలో వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్కు హోంమంత్రి వంగలపూడి అనిత (Vangalapudi Anitha) సంచలన సవాల్ విసిరారు.
జగన్కు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి డీఎస్సీపై మాట్లాడాలని ఛాలెంజ్ చేశారు. రాజకీయ లబ్ది కోసం వైసీపీ అధినేతతో సహా పార్టీ శ్రేణులు మెగా డీఎస్సీపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. గత ఐదేళ్ల పాలనలో ఒక్క డీఎస్సీ నిర్వహించనివారు.. ఇప్పుడు డీఎస్సీ గురించి మాట్లాడటం హాస్యాస్పదం అని ఎద్దేవా చేశారు.
జగన్ సహా వారంతా దురదృష్టవంతులు
గతంలో మండలిని రద్దు చేస్తామని జగన్ ప్రకటన చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు అదే మండలికి తమ సభ్యులను పంపి నిలదీస్తామని అంటున్నారని సెటైర్ వేశారు. అయితే జగన్ సహా వైసీపీలో గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలు దురదృష్టవంతులు అని ఆమె అన్నారు. శాసన సభలో మాట్లాడేందుకు సమయం ఉన్న కూడా వారు వెనకడుగు వేస్తున్నారని చెప్పారు. మంత్రి లోకేష్ని చూస్తే వైసీపీ నేతలకు భయం వేస్తోందని.. చట్ట సభలో ఆయన్ని ఎలా ఎలా ఎదుర్కోవాలో వారికి అర్థం కావడం లేదని తెలిపారు.

