కలం, మహబూబ్నగర్ బ్యూరో: భూత్పూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో (Bhuthpur ZPHS) పారిశుద్ధ్య చర్యలను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ (Madhusudan Naik) బుధవారం పరిశీలించారు. పాఠశాల ఆవరణతో పాటు పరిసర ప్రాంతాలను పరిశీలించిన ఆయన.. విద్యార్థులు, ఉపాధ్యాయులకు పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని పాఠశాల అధికారులను ఆదేశించారు. పాఠశాల ఆవరణలో చెత్త, వ్యర్థ పదార్థాలు పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు తొలగించాలని సూచించారు. పిచ్చిమొక్కలు, పొదలు, కలుపు మొక్కలను పూర్తిగా తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని తెలిపారు. ముఖ్యంగా పాములు దాగేందుకు అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి శుభ్రం చేయాలని ఆదేశించారు.
విద్యార్థులు, సిబ్బంది భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని అదనపు కలెక్టర్ సూచించారు. పాము కాట్ల నివారణకు అవసరమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, పాఠశాల పరిసరాలలో పారిశుద్ధ్య ప్రమాణాలను నిరంతరం పర్యవేక్షించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పాఠశాల ఆవరణ పరిశుభ్రత విషయంలో నిర్లక్ష్యం వహించకుండా, విద్యార్థుల ఆరోగ్యం, భద్రతకు అనుగుణంగా చర్యలు కొనసాగించాలని స్పష్టం చేశారు.

