కలం, దమ్మ పేట: ఇన్నాళ్లూ పెద్ద పెద్ద నగరాలకే పరిమితమైన యాప్ ఆధారిత రవాణా సేవలు ఇప్పుడు పల్లె బాట పట్టాయి. మెట్రో నగరాల్లో లభించే ఓలా, ఉబర్ సేవలకు ప్రత్యామ్నాయంగా, భద్రాద్రి కొత్తగూడెం (Bhadadri Kothagudem) జిల్లా దమ్మపేట (Dammepeta) మండల ప్రయాణికుల కోసం ‘KTS సర్వీస్’ (KTS Service App) అందుబాటులోకి వచ్చింది. స్థానిక నిరుద్యోగ యువతకు పార్ట్ టైమ్ ఉపాధి కల్పించడంతో పాటు, ప్రయాణికులకు సురక్షితమైన ప్రయాణాన్ని అందించే లక్ష్యంతో దమ్మపేట యువత నెలకొల్పిన ‘నిటాల్ జీఎస్ టెక్నాలజీస్’ స్టార్టప్ ఈ సరికొత్త యాప్ను రూపొందించింది.
ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దమ్మపేట మండల తహసీల్దార్ (ట్రైనీ) డిప్యూటీ కలెక్టర్ మద్దినేని మురళి చేతుల మీదుగా KTS సర్వీస్ యాప్ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ యాప్ ద్వారా దమ్మపేట మండల పరిధిలోని ప్రజలకు ఆటో, బైక్, కార్ల ద్వారా సౌకర్యవంతమైన రవాణా అందుబాటులోకి రానుంది. ప్రయాణికుల రక్షణ దృష్ట్యా ప్రతి వాహనంలో 24/7 నిరంతర జిపిఎస్ ట్రాకింగ్ సదుపాయాన్ని అందుబాటులో ఉంచినట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు.
ఈ సందర్భంగా డిప్యూటీ కలెక్టర్ మద్దినేని మురళి మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల నుంచి యువత ఎంటర్ప్రెన్యూర్లుగా ముందుకు రావడం ఎంతో ఆనందదాయకమని కొనియాడారు. ప్రపంచంలో పేరుగాంచిన ఎన్నో దిగ్గజ కంపెనీలు ఇలా చిన్న స్థాయిలోనే ప్రారంభమై విస్తరించాయని గుర్తు చేస్తూ, కొత్త ఆలోచనలతో రాణించాలనుకునే యువతకు తన మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని చెప్పారు.
ప్రయాణికులకు నాణ్యమైన సేవలు అందించి ప్రజల నమ్మకాన్ని గెలుచుకోవాలని ఆయన నిర్వాహకులకు సూచించారు. ఈ సేవలు స్థానిక యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలను కల్పిస్తాయని, అంతేకాకుండా మహిళా ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని త్వరలోనే ప్రత్యేకంగా మహిళా డ్రైవర్ల సేవలను కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు కంపెనీ ప్రతినిధులు జల్లిపల్లి సత్య గౌతమ్, చవ్వ సాయి రామకృష్ణ వెల్లడించారు.

