కలం, కరీంనగర్ బ్యూరో: స్కిల్ఫోర్జ్ అకాడమీ ఆధ్వర్యంలో ఈ నెల 20న కరీంనగర్ గణేష్నగర్లోని అదితి బ్యాంక్వెట్ హాల్లో నిర్వహించనున్న సైబర్ సెక్యూరిటీ అవగాహన సదస్సు పోస్టర్ను టీఎన్జీఓస్ కేంద్ర సంఘం రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్, జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాస్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మారం జగదీశ్వర్ మాట్లాడుతూ.. ప్రస్తుత డిజిటల్ యుగంలో సైబర్ నేరాల నుంచి రక్షణ పొందాలంటే ప్రతి ఒక్కరికీ అవగాహన అత్యవసరమని, “ఒక్క క్లిక్ చేసే ముందు ఒక్కసారి ఆలోచించాలి” అనే జాగ్రత్తను అలవాటు చేసుకోవాలని సూచించారు.
దారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం సైబర్ మోసగాళ్లు మొబైల్ ఫోన్ల ద్వారా ప్రజలను లక్ష్యంగా చేసుకుంటున్నారని.. ఓటీపీలు, ఫేక్ లింకులు, డిజిటల్ చెల్లింపుల మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. సైబర్ నేరాలను ఎదుర్కొనేందుకు అవగాహనే ప్రధాన ఆయుధమని పేర్కొంటూ ఈ ఉచిత సదస్సుకు యువత, ఉద్యోగులు, విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి ముప్పిడి కిరణ్ కుమార్, రాగి శ్రీనివాస్, సర్దార్, ఆర్మీందర్ సింగ్ రాజేష్ భరద్వాజ్, వాస్తవికు, కోట రామస్వామి, శంకరయ్య, జీవన్, జీనియస్ అకాడమీ చైర్మన్ అనూప్ నారాయణ, నరసయ్య, వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు, నిర్వాహకులు పాల్గొన్నారు.

