కలం, వెబ్ డెస్క్ : దేశంలో దగ్గు మందుల (Cough Syrup) విక్రయాలు, వినియోగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఎవరైనా దగ్గు మందు కొనాలంటే కచ్చితంగా అర్హత కలిగిన వైద్యుడి చీటి (Prescription) తప్పనిసరి చేస్తూ కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఒక అధికారిక నోటిఫికేషన్ను విడుదల చేసింది.
ఈ మేరకు దశాబ్దాల నాటి ఔషధ నిబంధనలలో కేంద్ర ప్రభుత్వం కీలక సవరణలు చేసింది. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ 1940 లోని సెక్షన్ 12, సెక్షన్ 33 ఆధారంగా, డ్రగ్స్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డ్తో సంప్రదింపులు జరిపిన అనంతరం ‘డ్రగ్స్ (ఐదవ సవరణ) నిబంధనలు, 2026’ ను తీసుకువచ్చింది. ఇందులో భాగంగా 1945 నాటి పాత ఔషధ నిబంధనలలోని ‘షెడ్యూల్ కె’ (Schedule K) జాబితా నుండి ‘సిరప్స్’ (Syrups) అనే పదాన్ని పూర్తిగా తొలగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.
గత ఏడాది డిసెంబర్ 29, 2025 న విడుదల చేసిన ముసాయిదా నిబంధనలపై ప్రజల నుండి వచ్చిన అభ్యంతరాలు, సూచనలను కేంద్ర ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఈ తుది నోటిఫికేషన్ను జారీ చేసింది. షెడ్యూల్ కె నుండి సిరప్లను తొలగించడం ద్వారా, ఇకపై సాధారణ దుకాణాల్లో లేదా వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా విచ్చలవిడిగా దగ్గు మందులను విక్రయించడానికి వీలుండదు. ప్రజారోగ్యాన్ని రక్షించడంలో, ముఖ్యంగా సిరప్ల అధిక వినియోగం, దుర్వినియోగాన్ని అరికట్టడంలో కేంద్ర ప్రభుత్వ అధికారిక గెజెట్లో ప్రచురితమైన ఈ కొత్త నిబంధనలు తక్షణమే అమలులోకి రానున్నాయి.

