Mobile Popup Ad
Mobile Popup Ad

రైతులను ఒత్తిడి చేస్తే లైసెన్స్ రద్దు చేస్తాం.. కలెక్టర్ వార్నింగ్

కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ (Nizamabad) జిల్లాలోని అన్ని సహకార సంఘాల గోడౌన్లలోని సేల్ పాయింట్లలో యూరియా నిల్వలు అందుబాటులో ఉండేలా ప్రణాళికాబద్దంగా పర్యవేక్షణ చేస్తున్నామని కలెక్టర్ (Collector) ఇలా త్రిపాఠి (Ila Tripathi) వెల్లడించారు. వానాకాలం సీజన్ పంటల సాగుకు అవసరమైన మేరకు పూర్తి స్థాయిలో ఎరువుల నిల్వలు జిల్లాలో అందుబాటులో ఉన్నాయని, రైతులు ఆందోళనకు గురి కావద్దని సూచించారు. ఎడపల్లి మండలంలోని జానకంపేట్, ఎడపల్లిలలో ఎరువుల గిడ్డంగులు, విక్రయ కేంద్రాలను కలెక్టర్ మంగళవారం తనిఖీ చేశారు.

గోడౌన్లలో నిల్వ ఉన్న యూరియా, ఇతర ఎరువులను పరిశీలించి, స్టాక్ వివరాల రిజిస్టర్‌లో పొందుపరచిన వాటికి అనుగుణంగా నిల్వలు అందుబాటులో ఉన్నాయా లేదా అని తనిఖీ చేశారు. యూరియా బుకింగ్ యాప్ పనితీరును కలెక్టర్ స్వయంగా పరిశీలించి, యాప్ వల్ల సమకూరే ప్రయోజనాల గురించి రైతులకు వివరించారు. ఈ యాప్ వల్ల ఎలాంటి నష్టం లేదని, గత రబీ సీజన్‌లో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అమలు చేసినట్లు గుర్తు చేశారు. ఎరువులు పక్కదారి పట్టకుండా, పారదర్శకంగా, ప్రణాళికాబద్దంగా యూరియా పంపిణీకి బుకింగ్ యాప్ దోహదపడుతుందన్నారు. ఈ విషయంలో రైతులు అపోహలకు గురి కావద్దని సూచించారు.

అయితే రైతులను నానో యూరియా కొనాలని బలవంతం చేయవద్దని, వారు కోరిన ఎరువులు మాత్రమే అందించాలని, ఇతర ఉత్పత్తులు కొనుగోలు చేయాలని ఒత్తిడి చేస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని, డీలర్ల లైసెన్సులు రద్దు చేసేందుకు కూడా వెనుకాడబోమని కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లా రైతుల అవసరాలకు సరిపడా ప్రస్తుతం 27 వేల మెట్రిక్ టన్నుల పైచిలుకు యూరియా ఎరువులు అందుబాటులో ఉన్నాయని, ఎక్కడ కూడా కొరత ఏర్పడకుండా రైతుల అవసరాలకు అనుగుణంగా అన్ని ప్రాంతాలకు నిల్వలను చేరవేస్తున్నామని తెలిపారు.

పలు సొసైటీలు డిఫాల్ట్ లో ఉండగా, వాటి పరిధిలోని రైతులకు సైతం ఇబ్బందులు తలెత్తకూడదని, స్థానికంగానే వారికి ఎరువులు అందుబాటులో ఉంచాలనే ఉద్దేశ్యంతో డీసీఎంఎస్ ద్వారా ఎరువుల పంపిణీ జరిపిస్తున్నామని అన్నారు. ఒకింత ముందుగానే పంటలు విత్తుకునే బోధన్, బాన్సువాడ నియోజకవర్గాల పరిధిలో ఇప్పటికే రైతులకు ఎరువుల పంపిణీ ప్రక్రియను ప్రారంభించినట్లు తెలిపారు. తదుపరి నిజామాబాద్, ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాలలో కూడా పక్కాగా పంపిణీ జరిగేలా చర్యలు తీసుకున్నామని, స్టాక్ పాయింట్లకు ఎరువుల నిల్వలు చేరవేశామని కలెక్టర్ వివరించారు. కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ అధికారి వీరస్వామి, జిల్లా సహకార శాఖ అధికారి శ్రీనివాస్, తహశీల్దార్ దత్తాద్రి, జానకంపేట్ సర్పంచ్ అనురాధ, సొసైటీ చైర్మన్ నరేందర్, స్థానిక అధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>