కలం, వెబ్ డెస్క్: అమెరికాలో ముగ్గురు స్నేహితుల ప్రాణాలు కాపాడి మరణించిన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్కు చెందిన కోడూరు అనురూప్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సంతాపం ప్రకటించారు. అత్యంత విషాదకరమైన ఘటనగా అభివర్ణించిన సీఎం.. తెలంగాణ ప్రభుత్వం, ప్రజల తరఫున బాధిత కుటుంబానికి ప్రత్యేకంగా సంతాప లేఖ పంపించారు. అంతేగాకుండా సీఎం ఆదేశాలతో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు అనురూప్ భౌతికకాయానికి శ్రద్ధాంజలి ఘటించి.. కుటుంబ సభ్యులను ఓదార్చారు.
అసలేం జరిగిందంటే..
అనురూప్ రెడ్డి అమెరికాలోని లూసియానా రాష్ట్రంలో ఉన్నత విద్య అభ్యసిస్తున్నాడు. గత నెల 29న టోరో బయూ పార్క్లో మునిగిపోతున్న తన ముగ్గురు స్నేహితులను కాపాడేందుకు ఏమాత్రం ఆలోచించకుండా నీటిలోకి దూకి రక్షించి, నీట మునిగి మరణించాడు. కేవలం 23 ఏళ్ల వయస్సులోనే, ఉజ్వలమైన భవిష్యత్తు ఉన్న అనురూప్ మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి.. అతడి అసామాన్య ధైర్యసాహసాలు, నిస్వార్థ సేవాభావం, పరాక్రమం అందరికీ ఆదర్శమని కొనియాడారు. ఈ సందర్భంగా లేఖ ద్వారా అనురూప్ తల్లిదండ్రులు, సోదరుడు ఆశ్రిత్ రెడ్డికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

