కలం, వెబ్ డెస్క్: విశాఖ ఉక్కుఫ్యాక్టరీ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలను మంత్రి లోకేశ్ (Lokesh) పరామర్శించారు. ఈ సందర్భంగా తీవ్రమైన ఉద్రిక్తత నెలకొన్నది. సరైన శిక్షణ లేని వారిని ఫ్యాక్టరీలోకి పంపించడం వల్లే ఈ ఘటన చోటు చేసుకున్నదని కార్మిక సంఘాలు ఆరోపించాయి. నేరుగా వారు లోకేశ్తోనే వాగ్వాదానికి దిగారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన చోటు చేసుకున్నదని కార్మికసంఘం నేతలు ఆరోపించారు.
లోకేశ్ అసహనం
కాగా తాను ప్రస్తుతం కేవలం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు మాత్రమే వచ్చానని.. ఈ అంశాన్ని రాజకీయం చేయొద్దని లోకేశ్ కోరారు. అయినప్పటికీ కార్మిక సంఘాలు వినిపించుకోలేదు.. ప్రాణాలు పోయినా ప్రభుత్వానికి పట్టడం లేదా? అంటూ వారు మండిపడ్డారు. దీంతో లోకేశ్ అసహనం వ్యక్తం చేశారు. తాము ఉక్కు ఫ్యాక్టరీని కాపాడామని చెప్పారు. ఉద్దేశ్యపూర్వకంగా రాజకీయం చేయడం సరికాదన్నారు. తాను బాధితులను పరామర్శించేందుకు వారికి ధైర్యం చెప్పేందుకు ఇక్కడికి వస్తే రాజకీయం చేయడం సరికాదని పేర్కొన్నారు.

