కలం, కరీంనగర్ బ్యూరో: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఈ నెల 22న శుక్రవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించే జిల్లా స్థాయి సభ విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా (Collector Chitra Mishra) అధికారులను ఆదేశించారు. జిల్లాస్థాయి సభ నిర్వహణపై వివిధ శాఖల జిల్లా అధికారులతో కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ప్రారంభం నుండి జిల్లా స్థాయిలో వివిధ శాఖల నుండి అనేక కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించామని, వాటన్నింటినీ డాక్యుమెంటరీ రూపంలో ప్రదర్శించాలని సూచించారు.
ప్రతి శాఖకు సంబంధించిన ప్రగతిపై పది నిమిషాల సమాచారం సిద్ధం చేయాలని తెలిపారు. ప్రభుత్వ పథకాలకు ఎంపికైన లబ్ధిదారులు, ప్రతి శాఖలో పెండింగ్ ఫైళ్ల క్లియరెన్స్, లబ్ధిదారుల ఎంపిక, ఆర్థికపరమైన లబ్ధి, వివిధ రకాల అవగాహన కార్యక్రమాలు, బడిబాట, జాబ్ మేళా వంటి కార్యక్రమాలను గురించి ఈ సభలో వివరించాలని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక పథకాలు, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం,రూ.500 కే సబ్సిడీ గ్యాస్ సిలిండర్, గృహజ్యోతి, సన్న రకం వరికి బోనస్, చేయూత పెన్షన్లు, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ఇందిరా మహిళా శక్తి బ్యాంక్ లింకేజీ, వడ్డీ లేని రుణాలు, ఇందిరమ్మ చీరలు, కొత్త రేషన్ కార్డుల లబ్ధిదారుల వివరాలు సభలో వివరించాలని కలెక్టర్ (Collector Chitra Mishra) తెలిపారు. సాధించిన విజయాలపై శాఖలు ద్వారా సమాచారం ఇవ్వాలని, లబ్ధిదారుల అభిప్రాయాలు, అనుభవాలు చెప్పడం వంటివి జిల్లా స్థాయి సభలో నిర్వహించాలని అన్నారు.
ఇప్పటి దాకా అమలు చేస్తున్న కార్యక్రమాలపై చర్చించాలని, భవిష్యత్లో చేపట్టనున్న పనులపై వివరించాలని ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి జిల్లా స్థాయి సభను విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, అడిషనల్ కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, సిపిఓ రామ్ దత్తారెడ్డి, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
Read Also: ఘోస్ట్ సిమ్ కార్డుల నెట్వర్క్ గుట్టురట్టు
Follow Us On: WhatsApp

