కలం, వెబ్ డెస్క్: కొత్త రేషన్ రేషన్ కార్డుల (New Ration Cards) పంపిణీకి సంబంధించి మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) కీలక ప్రకటన చేశారు. అర్హత ఉండి దరఖాస్తు చేసుకున్న వారికి 48 గంటల్లోనే రేషన్ కార్డు అందిస్తామని మంత్రి తెలిపారు. నేడు హైదరాబాద్లోని నాంపల్లి, చాంద్రాయణగుట్ట నియోజకవర్గాలకు చెందిన 361 మంది లబ్ధిదారులకు పొన్నం ప్రభాకర్ డబుల్ బెడ్ రూం ఇండ్ల పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వ పాలనలో పదేళ్లుగా ఎంతో మంది రేషన్ కార్డు కోసం తిరిగితే ఎవ్వరికీ ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అర్హులను ధైర్యంగా దరఖాస్తు చేసుకోమని చెప్తుందన్నారు. అన్ని అర్హతలు ఉంటే ఎలాంటి జాప్యం లేకుండా కార్డు అందజేస్తామని తెలిపారు.
ప్రజా ప్రభుత్వంలో పేదలకు సన్న బియ్యం పంపిణీ చేస్తూ, ఉచిత కరెంట్ ఇస్తూ ఆదుకుంటున్నామన్నారు. త్వరలో హైదరాబాద్ నగరంలో కూడా స్పెషల్ డ్రైవ్ నిర్వహించి మహిళా సంఘాలు ఏర్పాటు చేసి లోన్లు ఇప్పిస్తామన్నారు. 18 సంవత్సరాలు నిండిన వారు మహిళా సంఘాల్లో చేరాలని సూచించారు. మహిళలు వ్యాపారం చేసుకొని స్వయం ఉపాధి పొందాలని ఆకాంక్షించారు. ఇక ఓఆర్ఆర్ పరిధిలో లక్ష ఇందిరమ్మ ఇండ్లు, త్వరలోనే 2 లక్షల మంది ఒంటరి మహిళలకు పెన్షన్లు ఇస్తామని తెలిపారు. కొద్ది రోజుల్లో హైదరాబాద్ పరిధిలో పురాతన భవనాలపై రివ్యూ చేపట్టనున్నట్లు మంత్రి ప్రకటించారు.

