కలం, వలిగొండ: ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి (Collector Anuraag Jayanti) సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం వలిగొండ మండలం లోతుకుంట గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని (KGBV) జిల్లా కలెక్టర్, రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డితో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జూన్ 12న పాఠశాలలు పునః ప్రారంభం కానున్న నేపథ్యంలో కేజీబీవీలో చేపడుతున్న అభివృద్ధి పనులను పరిశీలించినట్లు తెలిపారు. తరగతి గదులు, వసతి గృహాలు, తాగునీరు, పారిశుద్ధ్యం, మరుగుదొడ్లు తదితర సౌకర్యాల ఏర్పాట్లపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నట్లు వెల్లడించారు.
పాఠశాల ప్రారంభం అయ్యే నాటికి పెండింగ్లో ఉన్న అన్ని అభివృద్ధి పనులను పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. విద్యార్థినులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పనుల నాణ్యతను పాటిస్తూ నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలన్నారు. విద్యార్థుల విద్యాభ్యాసానికి అనుకూల వాతావరణం కల్పించడంపై ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతుందన్నారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారి బిక్షపతి, తహసీల్దార్ దశరథ, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

