కలం, ఖమ్మం బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా జూలూరుపాడు (Julurupadu) ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ అంకిత్ (Collector Ankit) సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేసి వైద్య సేవలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. మొదటగా ఇన్పేషెంట్ వార్డును సందర్శించిన కలెక్టర్, అక్కడ చికిత్స పొందుతున్న రోగులతో నేరుగా మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితి, అందుతున్న వైద్యం, సిబ్బంది స్పందనపై వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఔట్పేషెంట్ విభాగాన్ని పరిశీలించి, రోగులతో మాట్లాడి సేవల నాణ్యతపై అభిప్రాయాలు సేకరించారు.
ఇన్పేషెంట్ విభాగంలో వడదెబ్బ కేసులు నమోదవుతున్నట్లు గుర్తించిన ఆయన, వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మండలంలో చలివేంద్రాలు ఏర్పాటు చేయడం, ఓఆర్ఎస్ ప్యాకెట్ల పంపిణీ వేగవంతం చేయాలని ఎంపీడీవోను ఆదేశించారు. ఆసుపత్రిలో ఔషధ నిల్వ గదిని పరిశీలించిన కలెక్టర్, స్టాక్ రిజిస్టర్లోని వివరాలు, వాస్తవ నిల్వలను సరిపోల్చి చూశారు. మందుల సరఫరా తగినంతగా ఉందా అనే విషయంపై అధికారులను ప్రశ్నించారు. ప్రభుత్వ మందులు ఎంతో విలువైనవని, అవి ఎట్టి పరిస్థితుల్లోనూ దుర్వినియోగం కాకుండా కట్టుదిట్టమైన పర్యవేక్షణ ఉండాలని హెచ్చరించారు.
సిబ్బంది హాజరు రిజిస్టర్ను తనిఖీ చేసి, విధుల్లో సమయపాలన, బాధ్యతల నిర్వర్తనపై ఆరా తీశారు. ప్రతి సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని, నిర్లక్ష్యాన్ని సహించబోమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ (Collector Ankit) మాట్లాడుతూ, ప్రభుత్వ ఆసుపత్రులు ప్రజలకు ప్రాథమిక ఆరోగ్య సేవల కేంద్రాలుగా కీలక పాత్ర పోషిస్తున్నాయని, అందించే సేవల నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. వైద్య సిబ్బంది ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేలా సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. అవసరమైన ఔషధాలు, పరికరాలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ తనిఖీలో తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో తాళ్లూరి రవి, మెడికల్ అధికారి వెంకటేశ్వర్లు, స్టాఫ్ నర్స్లు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
Read Also: పీఎం సూర్యఘర్ యోజనపై కలెక్టర్ అంకిత్ సమీక్ష
Follow Us On : WhatsApp

