కలం, వెబ్ డెస్క్: తమిళనాడులోని కోయంబత్తూరులో పదేళ్ల బాలికపై హత్యాచార ఘటన సంచలనం కలిగిస్తోంది. దీనిపై స్పందించిన సీఎం విజయ్ (CM Vijay) తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇది తనను షాక్కు గురి చేసిందని.. బాధితురాలి కుటుంబానికి సానుభూతి ప్రకటించారు. కోయంబత్తూరు ఎస్పీతో ఫోన్లో మాట్లాడిన ముఖ్యమంత్రి విజయ్.. వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశామని ఎస్పీ వివరించారు. ఇంతటి దారుణానికి ఒడిగట్టిన వ్యక్తులను వదిలిపెట్టబోమని.. వారికి వీలైనంత త్వరగా కఠిన శిక్షలు పడేలా చేస్తామని బాధితురాలి కుటుంబానికి సీఎం హామీ ఇచ్చారు. ఇందుకు సంబంధించి అన్ని రకాల చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించారు.
డీఎంకే విమర్శలు..
రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకుండా పోయిందని.. కోయంబత్తూరు ఘటనతో అది మరోసారి నిరూపితమైందని డీఎంకే విమర్శలు గుప్పించింది. వెంటనే, శాంతి భద్రతలపై సమీక్ష చేసి.. ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రిని డిమాండ్ చేసింది.

